అమరావతిలో మరోసారి లాండ్ పూలింగ్ - లక్ష్యం ఖరారు..!!
అమరావతి నిర్మాణం పైన అడుగులు పడుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత అమరావతి లో మళ్లీ కదలిక వచ్చింది. కేంద్రం సైతం అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం ఇప్పిస్తామని బడ్జెట్ లో ప్రకటించింది. గతంలో అఖరారు చేసిన మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే నిర్మాణాలు జరగనున్నాయి. కోర్టు కేసుల పరిష్కారం పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతిలో లాండ్ పూలింగ్ మరో సారి నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది.
సీఆర్డీఏ నిర్ణయం
రాజధాని మాస్టర్ప్లాను పునరుద్ధరణ దిశగా సిఆర్డిఏ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పూలింగులో ఇవ్వగా మిగిలిన భూమిని రైతుల నుండి సేకరణ పద్ధతిలో తీసుకునేందుకు సిద్ధమైంది. ఎవరైనా రైతులు ముందుకొచ్చి పూలింగు పద్ధతిలో భూములిస్తే తీసుకోవాలనీ నిర్ణయించింది. దీనికి సంబంధించి అంతర్గత ప్రక్రియను మొదలుపెట్టింది. రాజధాని అమరావతి పరిధిలో పూలింగు ప్రక్రియ ముగిసే నాటికి 4,800 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. దీనిపై అప్పటి ప్రభుత్వం 2015 చివర్లో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అనంతరం కొంతమంది రైతులు భూములు పూలింగు పద్ధతిలో సిఆర్డిఏకు ఇచ్చేశారు. 2016 చివరి నాటికి 2,200 ఎకరాలు మాత్రమే పెండింగ్లో ఉంది.

మాస్టర్ ప్లాన్ పునరుద్దరణ
పూలింగుకు ఇవ్వని భూమిని యజమానులు ఎక్కువ భాగం అమ్మగా కొనుగోలు చేసిన వారు పూలింగుకు ఇచ్చేశారు. 2018 చివరి నాటికి మొత్తంగా 1,900 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వం నయానో భయానో రైతులతో మాట్లాడి ఇంకొంత భూమిని సమీకరణ ప్రక్రియలో తీసుకుంది. సుమారు 1,320 ఎకరాల వరకూ భూమి సేకరణ ప్రక్రియ కిందకు వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పూలింగుకు ఇవ్వని వారి భూములను తిరిగి వారికే ఇచ్చేస్తామని, సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తామని వైసిపి నాయకులు ప్రకటించారు. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రాజధానులను ప్రకటన చేసింది. అనంతరం అమరావతి పరిధిలో పనులు నిలిచిపోయాయి.
మరోసారి భూసమీకరణ
అప్పటికి పెనుమాకలో సుమారు 625 ఎకరాలు, మందడంలో 111 ఎకరాలు, వెంకటపాలెంలో 66 ఎకరాలు, ఉండవల్లిలో 120 ఎకరాలు పెండింగ్లో ఉంది. వీటితోపాటు వెలగపూడి, మల్కాపురం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం పరిధిలో సుమారు 320 ఎకరాల వరకూ పెండింగ్లో ఉంది. పూలింగు పరిధిలో ఉన్న గ్రామాల్లో భూములను రైతులకు ఇచ్చేయడం వల్ల అమరావతి మాస్టర్ప్లానుకు ఇబ్బంది కలుగుతుందని, తాము పూలింగుకు ఇచ్చిన భూముల్లో మాస్టర్ప్లాను అమలు జరిగేలా చూడాలని జెఎసి తరుపున రైతులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అయితే పూలింగుకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషనూ ఇచ్చే అవకాశం లేని నేపథ్యంలో సేకరణ ప్రకటన ఇచ్చి అందులో పేర్కొన్న వారు స్వచ్చందంగా ముందుకొచ్చి పూలింగుకు ఇస్తే తీసుకోవాలనీ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications