హ్యాక్ చేసి లక్షలు చోరీ: కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
విజయవాడ: ప్రకాశం జిల్లాలో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఒంగోలులో ఓ గ్రైనేట్ కంపెనీ ఖాతాను హ్యాక్ చేసి రూ.75 లక్షల నగదును దుండగులు దారి మళ్లించారు. గోపాల్నగర్కు చెందిన చల్లా శ్రీనివాసరావు అంజనీ ఎక్స్పోర్టు అనే కంపెనీ ద్వారా గ్రైనేట్ ఎగుమతుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనా వ్యాపారులు కొందరు గ్రైనేట్ కోసం లక్షా పాతికవేల డాలర్లను శ్రీనివాస్ ఖాతాలో జమచేశారు.
నగదు జమ చేసిన తరువాత ఎన్ని రోజులైనా సరుకు రాకపోవడంతో చైనా వ్యాపారులు శ్రీనివాస్ను ప్రశ్నించారు. అయితే డబ్బులు జమ చేయకపోవడం వల్లే సరుకు పంపలేదని శ్రీనివాస్ చెప్పడంతో అవాక్కయ్యారు. లండన్కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్రావు ఖాతాను హ్యాక్ చేసి లక్షాపాతికవేల డాలర్లు దారి మళ్లించినట్లు నిర్ధారించారు. శ్రీనివాసరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యార్థిని ఆత్మహత్య
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని మంగళవారం ఉదయం ఉరేసుకుంది. కృష్ణా డిస్సా పునాదిపాడులోని కార్పొరేట్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఉరేసుకున్న విద్యార్థిని మాగంటి నర్మదగా గుర్తించారు. విద్యార్థిని ఆత్మహత్యను అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి స్వస్థలం చిత్తూరు జిల్లా ఎస్ఆర్ కండ్రిగ మండలం కొత్తందు.
కృష్ణా నదిలో ముగ్గురు గల్లంతు
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం, మద్దూరు వద్ద కృష్ణానదిలో ముగ్గురు విద్యార్థులు మంగళవారం గల్లంతయ్యారు. ముగ్గురూ ఇంజనీరింగ్ విద్యార్థులేనని సమాచారం. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు కృష్ణా జిల్లా వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన బి శ్రీకాంత్ (21), విజయవాడ సమీపంలోని నిడమనూరుకు చెందిన జొన్నలగడ్డ రాజేష్ (21), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన బి. లాల్ బాబు (21) నదిలో గల్లంతయ్యారు.
ఆ ముగ్గురితో పాటు మరో ఐదుగురు విద్యార్తులు జలవనరులపై సర్వే చేయడానికి కృష్ణా నది ఒడ్డుకు వచ్చారు. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి కృష్ణానది ప్రాంతంలో వేర్వేరు చోట్ల సర్వే ప్రారంభించారు. ఒక గ్రూపునకు చెందిన శ్రీకాంత్, రాజేష్, లాల్ బాబు, నాగుల్ మీరా నదీ పరివాహక ప్రాంతం మధ్యలోకి వచ్చారు. గల్లంతైన ముగ్గురు ప్రమాదవశాత్తు గుంతలోకి జారీ అక్కడి నుంచి నదిలోకి జారి పడ్డారు. అక్కడ ఉన్న మరో విద్యార్థి నాగుల్ మీరా మిగతా విద్యార్థలకు సమాచారం అందించాడు. దాంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్, లాల్ బాబు మృతదేహాలు లభ్యమయ్యాయి. శ్రీకాంత్ కోసం గాలింపు జరుపుతుననారు.
20 రోజుల శిశువును వదిలేశారు..
గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం కట్టెంపూడిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర 20 రోజుల మగశిశువును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. శిశువుకు చూపులేనందు వల్లనే విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం పూజ చేసేందుకు వచ్చిన పూజారి శిశువును గుర్తించి స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు శిశువు గురించి విచారణ జరుపుగా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో శిశువును గోతాల స్వామి ఆశ్రమానికి అప్పగించారు.