హుధుద్: మహిళపై చేయి చేసుకున్నారు, ఫ్రీ టాక్టైం..
విశాఖపట్నం: విశాఖలోని మర్రిపాలెం 104 కాలనీలో మహిళలపై నేవీ అధికారులు దౌర్జన్యం ప్రదర్శించారు. తుపాను కారణంగా తీవ్ర నీటికొరత ఉండటంతో ఎప్పటికి నీరు వస్తాయని అడగడానికి వెళ్లిన మహిళలను నేవీ అధికారి అసహనంతో అసభ్యంగా దూషించడంతో పాటు ఓ మహిళపై చేయి చేసుకున్నాడు.
అధికారి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు ఆందోళనకు దిగారు. నేవీ వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. వెంటనే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. మహిళలను శాంతపరిచి, ఆందోళన విరమింపజేశారు. తమకు ముందు కరెంట్ వద్దని, నీళ్లు కావాలని మహిళలు మొరపెట్టుకున్నారు.

ఉచిత టాక్ టైం: పరకాల
అవసర సమయంలో సమాచార వ్యవస్థ దెబ్బతినడం పైన ప్రభుత్వం ఆగ్రహంతో ఉందని పరకాల ప్రభాకర్ అన్నారు. వినియోగదారులకు ఉచిత టాక్ టైం ఇచ్చే యోచనలో ఆపరేటర్లు ఉన్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.
రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమాచార వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పారు. బంగాళాదుంప, ఉల్లిపాయలు అన్ని త్వరలో వస్తాయన్నారు. కొవ్వొత్తులు కూడా పంపిణీ చేస్తామన్నారు. కాగా, చంద్రబాబు హుధుద్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజల సమస్యను అడిగి తెలుసుకుంటున్నారు.
ఒక్కరోజులో ఎవరి వల్ల కాదు: జేసీ
హుధుద్ కారణంగా భారీ నష్టం సంభవించిందని, దీనిని ఒక్కరోజులో సరిదిద్దటం ఎవరి వల్ల కాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఒక్క దాని వల్లనే అంతా కాదన్నారు. ప్రతిపక్షాలవి అర్థం లేని ఆరోపణలన్నారు. ప్రభుత్వం వల్లే అన్నీ జరగవన్నారు.
నేపాల్ను తాగిన హుధుద్
ఉత్తరాంధ్రను వణికించిన హుధుద్ తుపాను ఉత్తర దిశగా పలు రాష్ట్రాల్లో పయనించి చివరకు నేపాల్ చేరింది. హుధుద్ప్రభావంతో నేపాల్లోని వాతావరణ పరిస్థితుల్లో విపరీత మార్పులు సంభవించాయి. అక్కడి మంచుకొండలు కరిగిపోతున్నాయి. 29 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో పర్వతారోహకులతో పాటు పశుపోషకులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications