cyclone jawad : తుపానుగా మారిన వాయుగుండం-ఏపీ, ఒడిశాకు ముప్పు-భారీవర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొద్ది సేపటి క్రితం తుపానుగా మారింది. ఇప్పటికే దీనికి జవాద్ గా నామకరణం చేశారు. దీని ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై పడనుంది. తుపాను ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం అంచనావేస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మధ్యాహ్నం జవాద్ తుపానుగా మారిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం. మహపాత్ర ఇవాళ ప్రకటించారు. ప్రస్తుత గాలుల వేగం గంటకు 60-70 కిమీ గా ఉందని ఆయన తెలిపారు. ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిమీ, ఒడిశాలోని పారాదీప్కు ఆగ్నేయంగా 650 కిమీ దూరంలో ఉందని చెప్పారు.

ఉత్తరాంధ్ర,తో పాటు ఒడిశాపై ఇది గరిష్ట ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం నాటికి గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 6వ తేదీ వరకు ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయలో జవాద్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎల్లుండి మధ్యాహ్నం నాటికి జవాద్ తుపాను పూరీ తీరాన్ని తాకి, తీరం వెంబడి పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని అంచనా. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది తాత్కాలికంగా 'తీవ్ర తుఫాను'గా మారుతుంది. డిసెంబర్ 5 నాటికి ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో గాలులు గంటకు గరిష్టంగా 90 కి.మీ.ల వేగంతో వీచే అవకాశం ఉంది. దీంతో మత్సకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ తుఫాను గతంలో వచ్చిన తిత్లీ వంటి వాటి కంటే చాలా తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫైలిన్, ఫణి, హుద్హుద్ వంటి విపరీతమైన తుపానుల తీవ్రత ఉండకపోవచ్చని అంచనా.
రేపు ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు ఈ తుపాను చేరుకునే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు తీరం వెంబడి గరిష్టంగా 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రేపు ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
కురుస్తాయని వెల్లడించింది. రేపు తీరం వెంబడి గరిష్టంగా 80-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీసే అవకాశముందని తెలిపింది. తుపాను సహాయక చర్యలకోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్టీఆర్ ఎఫ్ బృందాల్ని అందుబాటులో ఉంచారు. మత్య్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్ళరాదని ఏపీ విపత్తుల విభాగం తెలిపింది. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.












Click it and Unblock the Notifications