క్యాంత్ తుఫాను కల్లోలం, ఏపీలో వ్యాపారుల ఆందోళన: తప్పిన ముప్పు
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న క్యాంత్ తుఫాను ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంతో పాటు ఒడిశా, తమిళనాడు తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలుననాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి గంటగంటకూ ఉద్ధృతమవుతూ తీవ్ర వాయుగుండంగా మారుతున్న క్యాంత్ శనివారం సాయంత్రానికి చెన్నై నుంచి విశాఖ మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ తుపాను బలాన్ని ముందే అంచనా వేస్తున్న వాతావరణ శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీరం వెంబడి అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని చెప్పింది.
కోస్తాంధ్రకు తుఫాను ముప్పు: తీరం వైపు దూసుకొస్తున్న కయాంత్
క్యాంత్ కారణంగా కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయ దిశగా 360 కి.మీ. దూరంలో క్యాంత్ కేంద్రీకృతమై ఉంది.
ఇది నెల్లూరు వద్ద తీరం దాటవచ్చని, ఒకవేళ దిశ మార్చుకుంటే మచిలీపట్నం, విశాఖ మధ్య తీరం దాటుతుందని చెబుతున్నారు. తుపాను గంటకు సుమారు పదిహేను కి.మీ.ల వేగంతో పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందన్నారు.
తీరం వెంట గంటకు 40కి.మీ.ల నుంచి 50కి.మీ.ల వేగంతో ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని గురువారం అధికారులు పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో సముద్రం ఒక మోస్తరు నుంచి తీవ్ర కల్లోలంగా మారే అవకాశం ఉందని చెప్పారు. వర్షాల తీవ్రత 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కాగా, ఈ సంవత్సరం దీపావళి పర్వదినం నిమిత్తం రూ.కోట్లాది వెచ్చించి తీసుకువచ్చిన టపాకాయల విక్రయాలపై భారీ వర్షాల ప్రభావం పడితే తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ శని, ఆది వారాల్లో వర్షాలు కురిస్తే, టపాకాయల అమ్మకాలు 70 నుంచి 80 శాతం వరకూ పడిపోతాయని అంచనా.
తప్పిన ముప్పు
ఏపీకి ముప్పు తప్పింది. క్యాంత్ తుఫాను గురువారం నాడు బలహీనపడింది. తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగాండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో మరింతగా బలహీనపడి వాయుగుండం, అల్పపీడనంగా మారుతుందని అధికారులు తెలిపారు.
తుఫాన్ ఈ నెల 28 నాటికి సముద్రంలోనే బలహీనపడుతుందని, అయితే ఒక్కోసారి బలపడే అవకాశం ఉంటుందన్నారు. క్యాంత్ తుఫాను గోపాలపూర్కు దక్షిణ ఆగ్నేయంగా 380 కి.మీ. దూరంలో, విశాఖకు ఆగ్నేయంగా 340 కి.మీ. దూరంలో ఉందన్నారు. తుఫాను ప్రభావంతో తీరంలో ఈదురుగాలులు వీస్తున్నాయి.