తీవ్ర తుఫానుగా మాండూస్ - ఈ జిల్లాలపైనే తీవ్ర ప్రభావం..!!
ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. తుఫాను తీవ్రత పైన ఐఎండీ అధికారులు ప్రభుత్వానికి తాజా సమాచారం అందించారు. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కి.మీ వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు నిర్దారించారు.
వచ్చే 6 గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుండి రేపు తెల్లవారు జాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలంటూ..
తుఫాను తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేసారు. ఇప్పటికే మాండూస్ తుఫాను - ముందస్తు చర్యలపైన ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముందస్తుగానే ప్రభావిత జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎపీడీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేసారు.

కోస్తా జిల్లాల్లో ముందస్తు చర్యలు
తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలపై ఉంటుందని అంచనా వేసారు. దీంతో, కోస్తా తీరం ప్రాంతంలో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఏపీతో పాటుగా తమిళనాడులోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందస్తుగా లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుకు ఆదేశాలు అందాయి. తుఫాను తీరం దాటే సమయంలో ఆరు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చారు. తుఫాను కారణంగా వచ్చే మూడు రోజులపాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతోసహాయక చర్యల కోసం రెడీగా ఉన్నామని ఎన్డీఆర్ఎఫ్, ఎపీడీఆర్ఎఫ్ టీంలను మొహరించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులను ఆదేశించారు. తిరుపతిలో తుఫాను కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

సీమ జిల్లాలకు అలర్ట్ - విమానాల రద్దు
మాండూస్ తుపాన్ కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాల దారి మళ్లించారు. అలాగే తూత్తూకుడి, షిరిడీకి వెళ్లే నాలుగు విమానాలు రద్దు చేశారు. రాయలసీమలో ఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు ,అన్నమయ్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సత్యసాయి, అనంతపురం చిత్తూరు ,అన్నమయ్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.












Click it and Unblock the Notifications