ఫైలిన్ తుఫాన్ దూకుడు: వణుకుతున్న శ్రీకాకుళం
శ్రీకాకుళం: ఫైలిన్ తుఫాను దూసుకొస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా భయంతో విలవిలలాడుతోంది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఇచ్చాపురం, సోంపేట, కవిటి మండలాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జిల్లాలో 37 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏ క్షణంలోనైనా సముద్రం ఉగ్రరూపం దాల్చి తమ కొంపలు ముంచేస్తుందోనని భయపడుతున్నారు. 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్కు మించి విధ్వంసం సృష్టించే దిశగా ఈ ఫైలిన్ ఉండొచ్చని ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లావాసులు భయంతో వణికిపోతున్నారు. ఫైలిన్ తుఫాను కేంద్రంలో గంటకు సుమారు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో రోడ్డుపై నడిచే మనుషులు కూడా ఎగిరిపోతారని కలెక్టర్ సౌరభ్గౌర్ అధికారుల సమీక్షా సమావేశంలో హెచ్చరించారు.
జిల్లాలో శుక్రవారం సాయంత్రానికి గాలులు లేకపోయినా చిన్నపాటి జల్లులు కురిశాయి. సుమారు 40 మీటర్లు ముందుకు సముద్రం చొచ్చుకు వచ్చింది. భావనపాడు తీరంలో ఇసుకదిబ్బల వరకూ సముద్రపు నీళ్లు రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. కళింగపట్నం సమీపంలో బందరువానిపేట వద్ద మత్స్యకారులకు చెందిన విశాంత్రి పాకలను సముద్రం ముంచేసింది. తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా జిల్లాకు మూడు జాతీయ విపత్తుల స్పందన దళాలను గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రప్పించారు.
నలబై మంది సిబ్బందితో ఉన్న ఒక్కో బృందం.. గార మండలం కళింగపట్నం, సంతబొమ్మాళి, సోంపేట మండలాల్లో సహాయక చర్యలు కోసం తరలివెళ్లాయి. నీళ్లల్లో మునిగిపోయే వారిని రక్షించడమే కాకుండా భవనాల శిథిలాలను కట్చేసే యంత్రాలు, ప్రాథమిక చికిత్స కిట్లు, ఎలాంటి తుఫాన్ బీభత్సాన్ని అయినా ఎదుర్కొనే వ్యవస్థ తమ వద్ద ఉందని సహాయక బృందాలు అంటున్నాయి.