తుఫానుగా మారిన వాయుగుండం: ఆంధ్రకు వార్ధా ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తుఫానుగా మారింది. దీనికి వార్ధా అని నామకరణం చేశారు. ఇది శనివారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది.
విశాఖపట్నం, డిసెంబర్ 9: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. శనివారం ఉదయం అది విశాఖపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను స్థిరంగా కొనసాగుతోంది. తుపానుగా మారిన వార్ధా భూ ఉపరితలంపైకి వచ్చి బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వార్ధా తుపాను ఈ నెల 12న నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 11నుంచి దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఉభయ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని ప్రధాన పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు.
తుపాను నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వార్ధా తుపాను ప్రభావంపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో శుక్రవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
విద్యుత్ స్తంభాలు, ప్రొక్లెయిన్లు, హెవీ కట్టర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. బాధితులకు పునరావాసం, సహాయ చర్యలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పంపిణీకి కావల్సిన రేషన్ సరుకులను ముందే సిద్ధం చేయాలని సూచించారు. నగదు కొరత లేకుండా ఆయా జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
తుపాను సహాయక చర్యలు, పునరావాసం నిమిత్తం చేపట్టిన చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి టక్కర్ వివరించారు. సహాయక చర్యల నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టామని, కంట్రోల్ రూములో మూడు బృందాలను ఇప్పటికే దీని నిమిత్తం నియమించామని స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ వివరించగా టాస్క్ఫోర్స్లో ఇస్రో కూడా భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి చెప్పారు.