సోనియాను దేవుడే వరంగా, బాబు ఆరాటపడ్డారు: డిఎస్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సోనియాను దేవుడే వరంగా ఇచ్చారన్నారు. తెలంగాణ, సీమాంధ్రలు భౌగోళికంగా వేరు అయినా మానసికంగా సమైక్యంగానే ఉంటాయన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకారంతో ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
కొందరు ఇరు ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారన్నారు. 14 ఏళ్లు నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసిందని అన్నారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం సంప్రదించిదని తెలిపారు. ఏ రాష్ట్ర ఏర్పాటుకు ఇంతగా అభిప్రాయ సేకరణ జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు రాజకీయ నిర్ణయం కాదని, సుదీర్ఘ చర్చల తర్వాతనే జరిగిందన్నారు.
కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన పివి నరసింహ రావు రాష్ట్రంలో ఎక్కువ కాలం ఉండలేకపోయారన్నారు. తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గమనించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. సోనియా మానవతా దృక్పథంతోనే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ పట్ల ఆమె చిత్తశుద్ధి చూసి దేవుడే ఆమెను ఈ దేశానికి, రాష్ట్రానికి వరంగా ఇచ్చినట్లు భావించానన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పుడు స్వాగతించారని, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు రెండు ప్రాంతాల్లో పార్టీని నిలబెట్టుకునేందుకు ఆరాటపడి ఉండవచ్చునని అయితే ఆ తర్వాత ఓ వైపు లొంగిపోయారన్నారు.
ఇప్పుడు తెలంగాణ టిడిపి నేతల పరిస్థితి దయనీయంగా తయారయిందన్నారు. తెలంగాణ కేవలం సోనియా వల్లనే వచ్చిందన్నారు. సీమాంధ్రులు తమకు అన్నదమ్ముల్లాంటి వారన్నారు. అనామకులను కూడా సోనియా గాంధీ మంత్రులుగా చేశారన్నారు. తెలంగాణ విషయంలో రాష్ట్ర నాయకులకు లేని చిత్తశుద్ధి సోనియా గాంధీకి ఉందన్నారు.