ఎన్నిసార్లు తల నరుక్కుంటావు?: కెసిఆర్ను ప్రశ్నించిన దామోదర
మెదక్/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణకు దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, లేకుంటే తల నరక్కుంటానని చెప్పిన కెసిఆర్ ఎన్ని సార్లు తల నరుక్కుంటారని ఆయన అడిగారు. ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇచ్చిన లెక్కలేనన్ని హామీల్లో ఒక్కదాన్ని కూడా కెసిఆర్ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
టిఎన్డీవోలకు సంబంధించి అసలు ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా, లేవా అని ఆయన అడిగారు. తెలంగాణ ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని కాంగ్రెసు నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఒక్కసారి తమ పార్టీ తెలంగాణలో బలం పుంజుకుంటే కెసిఆర్ ఏమీ చేయలేరని, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కూడా ఏమీ చేయలేదని కాంగ్రెసు జాతీయ నేత కుంతియా అన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెసు విఫలం
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు. త్వరలో అన్ని జిల్లాలో పర్యటించాలని నిర్ణయించినట్లు సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు. తాము బీజేపీతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.
సోమవారం టీటీడీపీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం సండ్ర మీడియాతో మాట్లాడారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి అన్ని జిల్లాల్లో పర్యటించాలని, జిల్లాల్లో వివిధ వర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన చేసుకుని, వాటిపై ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పారు.
సంస్థాగతంగా బలంగా లేకుండా ఏ పార్టీ ముందుకు పోదని, అందుకనే ప్రజా సమస్యలపై ఒక పక్క పోరాడుతూనే పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కూడా తమ పార్టీ పనిచేస్తుందని సండ్ర స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బీజేపీతో కలిసి అన్ని సమస్యలపై ఒక అంగీకారానికి వచ్చి కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు.