కిరణ్పై మళ్లీ విరుచుకుపడ్డ దామోదర, చంద్రబాబు పైనా
న్యూఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, నేతలతో కలిసి ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కాన్వాయ్ వెళ్తుంటే తమ ప్రాంతానికి చెందిన మహిళా మంత్రులు, ఇతర నేతలు అడ్డుకుంటే ఆయన వారిని అడిగే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. సిఎం ఆదేశాల మేరకే పోలీసులు మహిళా మంత్రులతో పాటు అందరిపట్ల అమానుషంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి వైఖరితో తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనయ్యారన్నారు. ఆయన తీరును తాము ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు. మరోసారి ఈ ముఖ్యమంత్రి కుట్ర ధోరణి, నియంతృత్వ వైఖరి బయటపడిందన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పర్యాయపదం కిరణ్ అని నిప్పులు చెరిగారు. 128 ఏళ్ల కాంగ్రెసు పార్టీకి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తెలుసునని అన్నారు.

తెలంగాణ ఉద్యమం త్యాగాలతో కూడిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ పైన సోనియా గాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని, ఆమెకు తాము కృతజ్ఞతగా ఉంటామన్నారు. కిరణ్ మాత్రం ఓ ప్రాంతానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయనకు నైతికత ఉంటే ఎప్పుడో రాజీనామా చేయాల్సి ఉండెనన్నారు.
రాజీనామా చేయకుండా తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన తన మూలాలు మర్చిపోయారన్నారు. 15వ తారీఖు లోగా తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడతారన్నారు. సిపిఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు సానుకూలంగా ఉన్నట్లు గతంలో ప్రకటించాయన్నారు. ఇప్పుడు కొందరు యూ టర్న్ తీసుకుంటున్నారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎందుకు వచ్చారు, ఏం కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. తాము ముఖ్యమంత్రిని చూసి కేబినెట్లో లేమని, అధిష్టానం కారణంగానే ఉన్నామన్నారు. కిరణ్ తీరును అధిష్టానం చూస్తోందని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందన్న నమ్మకముందన్నారు.












Click it and Unblock the Notifications