అందరి గురించి తెలిసి: చివర్లో టర్న్ తీసుకున్నారా, దాసరి ఆరా?
దివంగత దాసరి నారాయణ రావు కాపుల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం అండగా నిలిచారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెబుతూ ఆ వర్గం నేతలను ఒక్కతాటి పైకి తీసుకు వచ్చారు.
అమరావతి: దివంగత దాసరి నారాయణ రావు కాపుల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం అండగా నిలిచారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెబుతూ ఆ వర్గం నేతలను ఒక్కతాటి పైకి తీసుకు వచ్చారు.
దాసరి నారాయణ రావు మృతి: అక్కడా రాజకీయం చేశారా?
కాపు రిజర్వేషన్లు, చంద్రబాబు వ్యవహారశైలి, కాపు సంక్షేమ పథకాల తీర్పు, తన ఆరోగ్య పరిస్థితిపై దాసరి ఇటీవల తనను కలిసిన కాపు నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
బలహీనపడతామని..
గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కాపు నాయకులు ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో దాసరి కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి కోట్లతో పథకాలు అమలు చేస్తున్న కాపు కార్పొరేషన్ను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కాపులపైనే ఉందని, దాన్ని బలహీనం చేసుకుంటే మనమే నష్టపోతామని దాసరి చెప్పారు.
ఆరా తీశా.. లబ్ధి చేకూరిందని..
కాపు ఉద్యమం సమయంలో ఒకవైపు నాయకుల మధ్య సమన్వయం కుదిర్చిన తాను, మరోవైపు కాపు కార్పొరేషన్ నుంచి రుణాలు, విదేశాలకు వెళ్లిన కాపు కుర్రాళ్లతో స్వయంగా మాట్లాడి అవి నిజమా, కాదా? అని ఆరా తీశానని, వారికి ఆ పథకాలతో లబ్ధి చేకూరినట్లు చెప్పారని తెలుస్తోంది.
అది మన తప్పే అవుతుందని..
మనకు టిడిపి, చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయన ఇస్తానన్న రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నామని, మంచిచేస్తే మెచ్చుకోవాలని, చెడు చేస్తే అడ్డుకోవాలని, ఇదే మన విధానంగా ఉండాలని, చంద్రబాబు గతంలో తన పార్టీకి మద్దతునిచ్చామన్న గౌరవంతోనో, భయంతోనో కాపుల కోసం చేస్తున్న మంచి పనులు ఉపయోగించుకోవాలని, అలా వాడుకోకపోవడం మన తప్పే అవుతుందని చెప్పారని అంటున్నారు.
దాసరి హితబోధ
టిడిపిని, చంద్రబాబును కేవలం బిసి రిజర్వేషన్ల విషయంలో మాత్రమే వ్యతిరేకించాలి తప్ప, పథకాలను వాడుకోకపోవడం సరైంది కాదని, లేకపోతే నిధులు మురిగిపోయి మనవాళ్లే నష్టపోతారని దాసరి వారికి హితబోధ చేశారని వార్తలు వస్తున్నాయి.
బాబు మనస్తత్వం తెలుసు..
చంద్రబాబు మనస్తత్వం తనకు తెలుసునని, అతను ఎవరితోనూ శత్రుత్వం కోరుకోడని, చెబితే వింటాడని, తన పార్టీకి లాభం వస్తుందంటే ఏం కావాలన్నా చేస్తాడని, మనకిది కావాలని ఒత్తిడి చేస్తే వినే నైజం, వెసులుబాటు, స్వేచ్ఛ బాబు వద్ద ఉందని, తాను చాలామంది పొలిటీషియన్లను చూశానని, మిగతా పొలిటీషియన్లు అలా కాదని దాసరి చెప్పారని తెలుస్తోంది.
చివర్లో దాసరి యూటర్న్ తీసుకున్నారా?
తాను మొన్నటి వరకూ బాబును వ్యతిరేకించానని, కొత్త ఫోర్స్ రావాలని కోరుకున్నానని, తనను పార్టీలోకి రమ్మని కోరారని, కానీ ఈతరం కుర్రాళ్లు పెద్దోళ్ల సలహాలు తీసుకునే పరిస్థితిలో లేరని, ఢిల్లీలో, ఇక్కడా అలాగే ఉందని, చంద్రబాబుతో రిజర్వేషన్ల విషయంలో తప్ప మనం ఎక్కడా విభేదించాల్సిన పని లేదని చెప్పారని తెలుస్తోంది. తనను పార్టీలోకి ఆహ్వానించారని కోరారని దాసరి చేసిన వ్యాఖ్యలను.. వైసిపిని ఉద్దేశించి అన్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
వారే ఏమైనా చేస్తారు
అధికారంలో ఉన్న వారు మనకు ఏదైనా చేయగలరని, మనకు ఇప్పుడుకనుక రిజర్వేషన్లు రాకపోతే ఇక ఎప్పటికీ రావని, దానికోసం పోరాటం చేద్దామని, ఎన్నికల నాటికి చంద్రబాబు ఏదో ఒకటి చేస్తాడనుకుంటున్నానని, తాను కేంద్రమంత్రిగా పని చేస్తున్నప్పుడు చూశానని, చాలా పథకాలు వాడుకోకపోవడం వల్ల అవి మురిగిపోయి వెనక్కివెళ్లిన సందర్భాలు చూశానని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.
క్రియాశీలక రాజకీయాలపై..
క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా పనిచేసే పరిస్థితిలో లేనని, దేవుడు కరుణించినంత కాలం, ఆరోగ్యం సహకరించినంత కాలం కాపుజాతి కోసం పని చేస్తానని, ఏ పార్టీలో ఉన్నా కాపులంతా కలిసి ఉండాలని, లేకపోతే బలహీనపడతామని, మనకు బలం ఉండబట్టే అన్ని పార్టీలు గౌరవిస్తున్నాయని గుర్తుంచుకోవాలని చెప్పారని అంటున్నారు. మరోవైపు, వైసిపి నేత భూమ మాత్రం దాసరి తమ పార్టీలోకి వద్దామనుకున్నారని చెప్పారు.