రాజీవ్, సోనియాలకే దాసరి విధేయుడు, మంత్రిపదవికి దూరంకావడానికి కారణమిదే!
రాజకీయాల్లో చాలాకొద్దిమందితోనే దర్శకరత్న దాసరినారాయణరావు కొందరితోనే సన్నిహితంగా ఉండేవారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తర్వాత సోనియాగాంధీకి ఆయన విధేయుడిగా ఉండేవారు.
హైదరాబాద్: రాజకీయాల్లో చాలాకొద్దిమందితోనే దర్శకరత్న దాసరినారాయణరావు కొందరితోనే సన్నిహితంగా ఉండేవారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తర్వాత సోనియాగాంధీకి ఆయన విధేయుడిగా ఉండేవారు.పార్టీలో ఇతర నాయకులను ఆయన పెద్దగా పట్టించుకొనేవారు కాదు.
రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినీరంగంలో ఉన్నకాలంలోనే ఆయన ఎక్కువగా సంతోషంగా ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతారు. రాజ్యసభసభ్యుడి ఉన్న కాలంలో ఢిల్లీ రాజకీయాలపై ఆయన చాలా విరక్తిచెందేవాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
ఢిల్లీ రాజకీయాలను చూసి సినిమాలతోనే తన జీవితం బాగుండేదని ఆయన తన సన్నిహితులవద్ద వ్యక్తం చేసేవారని సమాచారం.అయితే కాంగ్రెస్ పార్టీ దాసరిని గౌరవించింది. పార్టీ తరపున ఆయన ప్రచారం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభసభ్యత్వం ఇవ్వడమే కాకుండా కేంద్రబొగ్గుగనుల శాఖ సహాయమంత్రిని కూడ చేసింది.
కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులనే అభిప్రాయాన్ని దాసరి వ్యక్తంచేసేవారని చెప్పారు.దక్షిణాది కంటే ఉత్తరాదిలో ప్రధానంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై ఆయన విరక్తి చెందేవారని సన్నిహితులు చెబుతుంటారు.
రాజీవ్ తర్వాతే సోనియాకే విధేయుడు
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొద్దిమందితోనే దాసరి స్నేహంగా ఉండేవాడు. ముఠాలు కట్టడం, కుట్రలు , కుతంత్రాలు ఆయనకు తెలియవు. దాసరి సన్నిహితులు చెప్పేమాట. రాజీవ్ తర్వాత పార్టీలో సోనియాకు మాత్రమే తుదివరకు ఆయన విధేయుడిగా ఉన్నాడు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ లు, సోనియా రాజకీయ కార్యదర్శులతో కూడ దాసరి ఎక్కువగా మాట్లాడేవారు కాదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
కేంద్రమంత్రి పదవి కోల్పోవడానికి కూడ రాజకీయ లౌక్యం లేకపోవడమేనా?
రాజకీయ లౌక్యం తెలియకపోవడం వల్లే ఆయన కేంద్రమంత్రిని కోల్పోయారనే అభిప్రాయం కూడ ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రిపదవి ఉన్నవారు పార్టీకి విరాళాలు ఇవ్వడంలో ప్రధానంగా ఉండేవారని, అయితే ఈ విషయంలో దాసరి వెనుకబడ్డారని చెబుతుంటారు. అంతేకాదు బొగ్గు నిక్షేపాల కేటాయింపులో తనపై మచ్చ పడటాన్ని దాసరి జీర్ణించుకోలేకపోయారని సన్నిహితులు చెబుతారు.
సినీ రంగమే బాగుంది
దర్శకుడిగా ఉన్నప్పుడే బాగున్నాను. అందరూ తనను దర్శకరత్నం అంటూ గౌరవించేవారు. ఢిల్లీ రాజకీయాలు తనకు ఒంటబట్టడడం లేదంటూ ఢిల్లీ రాజకీయాలపై దాసరి అసహనాన్ని ప్రదర్శించేవారని సన్నిహితులు చెబుతుంటారు. రాజకీయాల నుండి దూరంగా ఉండడానికి ఢిల్లీ రాజకీయాలు కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతారు.
రాజీవ్ వల్లే కాంగ్రెస్ పార్టీలోకి
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారననే అభిప్రాయం కూడ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున దాసరి ప్రచారం చేసేవారు.అయితే రాజీవ్ మరణం తర్వాత ఆయనను పార్టీ దూరం పెడుతోందనే అభిప్రాయాన్ని ఆయన మధనపడేవాడు. అయితే 2000 సంవత్సరంలో ఆయనకు రాజ్యసభసభ్యత్వాన్ని ఇవ్వడంతో రాజకీయగా దాసరి రెండో ఇన్సింగ్ ప్రారంభించారు. 2004 లో బొగ్గు గనుల శాఖ సహయశాఖమంత్రిగా నియమితులయ్యారు.2006 ఏప్రిల్ 3న, వరుసగా రెండోసారి ఆయనకు దాసరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008 ఏప్రిల్ వరకు ఆయన నాలుగేళ్ళపాటు బొగ్గుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
శిబూసోరేన్ జైలుకు వెళ్ళడంతో
అందరితో కలివిడిగా నవ్వుతూ మాట్లాడేవాడని దాసరికి పేరుంది. పార్లమెంట్ లో ఎంపిలను నవ్వుతూ పలకరించేవాడు.బొగ్గు గనుల శాఖ మంత్రి శిబుసోరేన్ జైలుకు వెళ్ళడంతో దాసరి ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. తర్వాతికాలంలో అదే శాఖ ఆయనకు బొగ్గు మసిని అంటించింది. అయితే బొగ్గు గనుల కేటాయింపు విషయంలో తనకు మచ్చవచ్చిందనే అభిప్రాయంతో దాసరి ఉండేవాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.