దారుణం: తల్లీకూతురుపై అత్యాచారం
గుంటూరు: జిల్లాలోని కట్టెంపూడిలో దారుణం చోటు చేసుకుంది. బట్టలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తల్లికూతురిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించి... అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దారుణ ఘటన పొన్నూరు మండలం కట్టెంపూడిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
కాగా, సదరు వ్యక్తుల బెదిరింపులతో భయపడిన వారు మిన్నకుండిపోయారు. అయితే బంధువుల చోరవతో బాధితులు పొన్నూరు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన రమేష్, వినోద్ లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పొన్నూరులో బట్టలు కొనుగోలు చేసి కట్టెంపూడి తిరిగి వస్తున్న క్రమంలో అత్యాచారానికి గురైయ్యారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
రెండు మోటారు సైకిళ్లు ఢీ: వ్యక్తిమృతి
అమరావతి-గుంటూరు రహదారిలో లేమల్లె గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మండల కేంద్రమైన అమరావతికి చెందిన బైరాపట్నం వీర అప్పారావు ఉరఫ్ అప్పారావు (57) గురువారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు.
విజయవాడ అశోక్నగర్కు చెందిన విశ్వంశెట్టి సాంబశివరావు మల్లాది గ్రామంలో ఉన్న కోళ్లఫారంలో కోళ్లకు ఇంజక్షన్లు చేసి కర్లపూడి గ్రామంలో ఇంజక్షన్లు చేసేందుకు వెళ్తున్నాడు. లేమల్లె గ్రామంలో ఇరువురి మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో వీర అప్పారావు అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం తెలుసుకున్న వెంటనే అమరావతి ఎస్ఐ కె వెంకట ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా అనంతరం, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అమరావతి 30 పడకల ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications