కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఘోరం: బకెట్లలో మృత శిశువులు
అమరావతి: కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాసుపత్రుల పనితీరు, ఆసుపత్రుల్లో పాలనా యంత్రాంగం ఎంత దారుణంగా ఉందో అనడానికి ఇదొక నిదర్శనం. ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో మృత శిశువుల మృతదేహాలను ఖననం చేసేందుకు కాంట్రాక్టర్ నిరాకరించాడు.
దీంతో గత కొన్నాళ్లుగా మృతశిశువుల మృతదేహాలను ఆసుపత్రి సిబ్బంది బకెట్లో వేసి ఉంచారు. దీంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మృతశిశువుల మృతేదేహాలు ఖననానికి నోచుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే గతంలో కర్నూలు ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో మృతి చెందిన శిశువు మృతదేహాలను తల్లిదండ్రులకే అప్పగించేవారు.
అయితే ఆ మృతశిశువులను తల్లిదండ్రులు చెత్తకుండీల్లో, మురికి కాల్వల్లో పడేస్తుండటంతో ఆసుపత్రిలో మృతి చెందిన మృతశిశువులను ఆసుపత్రి యాజమాన్యమే ఖననం చేసేలా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఒక్కో మృ శిశువు మృతదేహానికి ప్రభుత్వం రూ. 120 ఇస్తోంది.
అయితే ప్రభుత్వం ఇస్తున్న 120 రూపాయలు తమకు సరిపోవడం లేదని ఆరు నెలల క్రితం ఈ కాంట్రాక్ట్ను తీసుకున్న కాంట్రాక్టర్ మృతశిశువుల మృతదేహాలను ఖననం చేయడం మానుకున్నాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది చేసేదేమీ లేక మృతశిశువుల మృతదేహాలను ఆసుపత్రి సిబ్బంది బకెట్లలో ఉంచారు.
అయితే గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో వాసన వస్తుండటంతో ఆసుపత్రి సిబ్బందే ఫోటోలు తీసి మీడియాకు అందజేయడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఆసుపత్రి సిబ్బంది నిర్లిప్తత ఎంతలా ఉందో చెప్పడానికి ఈ ఘటనే కారణమని అంటున్నారు.
ఈ ఘటనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా మృత శిశువుల మృతదేహాల నుండి వస్తున్న వాసన దెబ్బకు అక్కడ ఏమాత్రం పనిచేయలేమని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ విచారించేందుకు స్వయంగా రంగంలోకి దిగి ఆసుపత్రికి వెళ్లారు.
ఆసుపత్రి సిబ్బందిని విచారించి మృతశిశువుల మృతదేహాలను తెప్పించి బుధవారపేట స్మశాన వాటికలో వాటిని ఖననం చేయించారు.