తిరుపతిలో పసికందుల మృతదేహాల కలకలం.. మురికి కాలువలో !
కుటుంబం గొడవలు కావొచ్చు, వివాహేతర సంబంధం కావొచ్చు.. ఆర్ధికపరమైన ఇబ్బందులు కావొచ్చు, మరే ఇతర కారణాలైనా కావొచ్చు కానీ.. ఓ దుర్మార్గపు పనికి మాత్రం ఒడిగట్టారు. ఇద్దరు పసికందులను మురికి కాలువలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరు అశోక్నగర్ సమీపంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న కాలువలో చెత్త తొలగిస్తుండగా పారిశుద్ధ్య కార్మికులు రెండు పసికందుల మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పసికందుల మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన ఆ శిశువులు కవలలుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శిశువుల వయస్సు కనీసం రెండు నుంచి మూడు రోజుల మధ్య ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే శిశువుల మృతదేహాలు కాలువలోకి కొట్టుకు వచ్చాయా ? లేక ఎవరైనా తెచ్చి పడేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నామని.. ఇటీవల ఆస్పత్రులు, ప్రసూతి కేంద్రాల్లో పుట్టిన శిశువుల వివరాలను సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అనూహ్య ఘటన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానవత్వాన్ని మంటగలిపేలా ఈ తరహా ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications