ఒక్కడినే..: కిక్కు కోసమేనా, పవన్ కల్యాణ్ రాజకీయ ఉద్దేశమా?
హైదరాబాద్: త్వరలో విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సినిమాలోని విలన్ విసిరిన సవాల్కు పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగుపైనే ఈ చర్చంతా సాగుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా ఇది ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది.
"ఒక్కడివీ ఏం చేయగలవ్ రా?" అని విలన్ అడిగితే "ఒక్కడినే.. ఒక్కడినే... ఎక్కడికైనా ఇలాగే వస్తా.. ఇలాగే ఉంటా... జనంలో ఉంటా.. జనంలా ఉంటా..." సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కల్యాణ్) సమాధానమ ఇస్తాడు. ఈ సంభాషణ ఆదివారం విడుదలైన ట్రైలర్లో కనిపిస్తుంది.
Also Read: పవన్కళ్యాణ్ వ్యాఖ్య, ప్రశ్నలెన్నో: ప్లేటు ఫిరాయిస్తారా?
జనసేన పార్టీని ఒంటరిగా నడుపుతున్న తీరుపై వినిపించే విమర్శలకు ఇది సమాధానమా అనే సందేహం వస్తోంది. తాను ఒక్కడే ఉన్నప్పటికీ కూడా.. జనంలో ఉంటూ.. జనంలాగానే ఉంటూ.. పనిచేస్తానని ఈ డైలాగుల ద్వారా పవన్ రాజకీయంపై వస్తున్న విమర్సలకు జవాబు ఇచ్చినట్లయిందని అంటున్నారు.
పవన్ కల్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీకి వ్యవస్థాపకుడు. దానికి అన్నీ ఆయనే. ఇప్పటి వరకు కమిటీలు వేయలేదు. పార్టీలో ఎవరున్నారో ఎవరు లేరో కూడా తెలియదు. కొంద మందికి మాత్రం సభ్యత్వాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. వారంతా పవన్ కల్యాణ్ అభిమానులు కావచ్చు.
అయినా రాజకీయాలతో కూడా సంబంధం ఉన్న హీరోలు తమ తమ చిత్రాల్లో తమకు అనుకూలమైన పార్టీకి అనువుగా, ప్రత్యర్థుల విమర్శలకు ఘాటుగా జవాబులిస్తూ సినిమాల్లో దృశ్యాలు, డైలాగులు ఉండేలా చూసుకోవడం తెలుగులో పరిపాటిగానే ఉంది.
అయితే, రాజకీయాలకూ సినిమాలకూ సంబంధం లేదని పవన్ కల్యాణ్ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. సినిమాలు వినోదం కోసమేనని అన్నారు. అందువల్ల ప్రేక్షకులకు, ముఖ్యంగా తన అభిమానులకు కిక్కు ఇవ్వడానికే ఆ డైలాగును వాడారా అనే ప్రశ్న కూడా వస్తోంది. ఏమైనా, అది రెండు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు.