పార్టీ మారిన కల్పనకు షాక్: వైసీపీని వీడమంటున్న స్థానిక నేతలు
తాము పార్టీని వీడేది లేదని పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు,పమిడిముక్కల మండల కన్వీనర్లు తాజాగా స్పష్టం చేశారు.
విజయవాడ: పామర్రు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కల్పన టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నాం కల్పన అధికార పార్టీలో చేరారు.
కాగా, కల్పనతో పాటు 30మంది సర్పంచ్ లు, 20మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొంతమంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. తాము పార్టీని వీడేది లేదని పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు,పమిడిముక్కల మండల కన్వీనర్లు తాజాగా స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వెంట తాము వెళ్లడం లేదని మొవ్వ, పాపమర్రు జడ్పీటీసీ సభ్యులు విజయశాంతి, పద్మావతి తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి టీడీపీపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును దుయ్యబట్టారు.
పార్టీ మారిన కల్పన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లలేదని పార్థసారథి తెలిపారు. నిన్నటిదాకా చంద్రబాబును దుయ్యబట్టి.. ఇప్పటి పార్టీ కండువా కప్పేసుకోగానే చిలుకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
సర్వేలన్ని తమకే అనుకూలమని చెబుతున్న చంద్రబాబు... దమ్ముంటే ఎన్నికలకు సిద్దపడుతారా అని పార్దసారథి సవాల్ విసిరారు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని అన్నారు.