కష్టమే?, జగన్ మార్చుకుంటారా!: వైఎస్ఆర్ జోష్ ఎక్కడ?..లేకపోతే రొటీన్ అయే ఛాన్స్..
పాదయాత్ర తీరు తెన్నులను ప్రశాంత్ కిశోర్ గమనిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రజా సంకల్ప యాత్రను ఓ ప్రత్యేక టీమ్ ను నియమించుకుని మరీ ఆయన చిత్రీకరిస్తున్నారు.
విజయవాడ: అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ఆర్నెళ్ల పాదయాత్రను ఆఖరి అస్త్రంగా సంధిస్తున్నారు జగన్. టీడీపీ వైఫల్యాన్ని ఎండగడుతూ వైసీపీ పట్ల విశ్వసనీయత పెరిగేలా పాదయాత్రను రూపొందించుకున్నారు.
Recommended Video

అనుకున్నట్టుగానే పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. అయితే ఇదే ఒరవడి చివరి వరకు కొనసాగుతుందా?.. అంటే జగన్ తన వైఖరి మార్చుకోవాలేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాదయాత్రల్లో జగన్ ఇస్తున్న స్పీచుల్లో అంత పదును ఉండటం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ జోష్ మిస్సయిందా!:
"నమస్తే చెల్లెమ్మా.. నమస్తే అక్కయ్యా... నమస్తే తమ్ముడూ.." దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికీ జనాలకు గుర్తున్నాయి. ఒకలాంటి జోష్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఆయన చనిపోయిన సమయంలోను చాలామంది ఈ వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. జగన్ ప్రసంగాల్లో ఆ జోష్ మిస్ అవుతుందోమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఎంతసేపు సానుభూతితో ఓట్లు అడుగుతున్నట్టే కనిపిస్తున్నారు తప్ప.. ఒక ధీమాతో, జోష్తో ముందుకెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ తరహా జోష్ జగన్ లో కొరవడిందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్స్టంట్ హామిలు..
పాదయాత్రల్లో జగన్ ఇచ్చే స్పీచులు ఎక్కువగా ఇన్స్టంట్ హామిల చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. రోగులకు చికిత్స కోసం డబ్బులతోపాటు, ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకునే సమయానికి కూడా డబ్బులు ఇస్తానమనడం, ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే.. కుటుంబానికి రూ.1500ఇస్తానడం వంటివి అందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి.
ఇలా ఇన్స్టంట్ హామిలు పెంచుకుంటూ పోవడం జగన్ కు ఎంతమేర లాభిస్తుందనేది చెప్పలేం. స్పీచుల్లోను పదేపదే చెప్పిన అంశాలే రిపీటవుతుండటంతో మున్ముందు జగన్ కు ఇది ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జగన్ తన స్పీచ్ ఫార్ములాను మార్చుకోవాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి.

రొటీన్ స్పీచులా?:
గత నాలుగు రోజుల జగన్ పాదయాత్రను గమనిస్తే.. ఆయన స్పీచుల్లోని లోపాలు స్పష్టమవుతున్నాయి. ఆరంభ సభలో చెప్పిన అంశాలనే ఆ తర్వాతి సభల్లోను ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఉదాహరణకు పక్కా ఇళ్లు కట్టిస్తానని చెప్పడం, రెండు చేతులు పైకెత్తి 'ఇలా ఇలా ఇలా' అనాలని చెప్పడం వంటివి రొటీన్ అయిపోయాయి.
అలాగే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని చెప్పడం, మద్యపానం నిషేధం వంటి హామిలు నవరత్నాల గురించి ప్రస్తావిస్తున్నారు. హామిలను జనంలోకి తీసుకెళ్లడం వరకు బాగానే ఉంది కానీ ప్రభావవంతంగా చెప్పలేకపోతున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మాట తీరు దాడి చేసినట్టుగా కాకుండా స్పీచులను మరింత సానబెట్టుకుని ప్రజలతో కమ్యూనికేట్ కావాల్సిన అవసరం కనిపిస్తోందంటున్నారు. లేదంటే.. ఒకే తరహా స్పీచులను ఆర్నెళ్ల పాటు కొనసాగించడం కష్టంగా మారుతుందంటున్నారు.

జగన్ సరిచేసుకుంటారా?:
పాదయాత్ర తీరు తెన్నులను ప్రశాంత్ కిశోర్ గమనిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రజా సంకల్ప యాత్రను ఓ ప్రత్యేక టీమ్ ను నియమించుకుని మరీ ఆయన చిత్రీకరిస్తున్నారు. యాత్రలో నుంచి కొన్ని ప్రత్యేక విజువల్స్, జగన్ స్పీచ్ కటింగ్స్ తో వీడియోలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. వాటిని సోషల్ మీడియా ద్వారా మరింత వ్యాప్తి చెందించాలనుకుంటున్నారు.
అయితే జగన్ స్పీచులకు మరింత పదును పెట్టాలన్న విషయాన్ని పీకె గుర్తిస్తున్నారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పీకె చెబితే జగన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉండటంతో.. ఆయన నుంచే ఈ సలహా వ్యక్తమవాలని భావించేవారు లేకపోలేదు. చూడాలి మరి జగన్ ఆర్నెళ్ల పాదయాత్రలో జగన్ స్పీచులు పాత దారిలోనే కొనసాగుతాయా? లేక రూటు మార్చుకుంటాయా?..












Click it and Unblock the Notifications