వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో సీబీఐ కేసుల నత్తనడక- జగన్ కేసుతో సహా- అంతర్వేది కొలిక్కివచ్చేనా..?

|
Google Oneindia TeluguNews

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ విచారణ పేరు చెబితే రాజకీయ నేతలు వణికిపోయేవారు. కేంద్ర దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ విచాఱణ ఎదుర్కోవడం నామోషీగా భావించేవారు. కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సీబీఐ రాకను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ భయాన్ని పోగొట్టినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఇలా వివాదం తలెత్తగానే అలా సీబీఐ విచారణ కోరడం రాజకీయ నేతలకు పరిపాటిగా మారిపోయింది. ప్రభుత్వం కూడా తమకేం పోయిందన్నట్లుగా సీబీఐకి కేసులు అప్పగించేస్తోంది. కానీ ఇప్పటివరకూ ఏడాది కాలంలో దాదాపు ఏడు కేసులు సీబీఐకి అప్పగించినా ఇప్పటికీ ఫలితం తేలకపోవడం గుర్తించాల్సిన అంశం.

సీబీఐ విచారణల సాగదీత..

సీబీఐ విచారణల సాగదీత..

ఏపీలో సీబీఐ విచారణ అంటేనే అది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదన్నట్లుగా పరిస్ధితి మారిపోతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు సీబీఐ చేపట్టిన కేసుల విచారణ ఇప్పటికీ ఏ స్ధాయిలో ఉందో చెప్పలేని పరిస్ధితి. రాజకీయ కక్షల నేపథ్యంలో దాఖలైన కేసులు కొన్ని, హైకోర్టు అప్పగించిన కేసులు కొన్ని, ప్రభుత్వాలు విపక్షాల ఒత్తిడి తట్టుకోలేక అప్పగిస్తున్న కేసులు కొన్ని సీబీఐ వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. వీటి దర్యాప్తు అసలు ముందుకు సాగుతుందా లేదా అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్ధితుల్లో కొత్తగా ప్రభుత్వం తాజాగా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన కేసును కూడా అప్పగించింది. దీంతో అసలు సీబీఐ విచారణ కంటే జ్యుడిషియల్‌ విచారణే కావాలని బీజేపీ కూడా కొత్త వాదన మొదలుపెట్టింది.

జగన్ ఆస్తుల కేసుతో సహా...

జగన్ ఆస్తుల కేసుతో సహా...

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్‌ జగన్‌పై అక్రమాస్తుల కేసు నమోదైంది. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ 11 కేసుల్లో ఛార్జిషీట్లు సైతం దాఖలు చేసింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వారం వారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కూడా నిలిచిపోయింది. ఇదే కోవలో ఏపీలో హైకోర్టు ఆదేశాలతో నమోదైన ఆయేషా కేసు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, డాక్టర్ సుధాకర్‌ కేసు నత్తనడకన సాగుతున్నాయి. వీటితో పాటు వైసీపీ ప్రభుత్వం అప్పగించిన రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కేసు, సుగాలి ప్రీతి కేసు, టీడీపీ నేత యరపతినేని మైనింగ్‌ కేసులో దర్యాప్తు తాజా పరిస్ధితి ఏంటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం అంతర్వేది కేసును కూడా కొత్తగా అప్పగించింది. దీంతో సీబీఐ ఈ కేసుల దర్యాప్తు ఎప్పటికల్లా తేలుస్తుందో తెలియడం లేదు.

 నిందితులంతా బయటే...

నిందితులంతా బయటే...

సీబీఐ కేసుల్లో దర్యాప్తు అంతకంతకూ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే నమోదైన కేసుల్లో నిందితులంతా ఎంచక్కా బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. ఇందులో స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ సైతం బెయిల్‌పైనే ఉన్నారు. ఆయనతో పాటు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు, వైఎస్ వివేకా కేసు నిందితులు, చివరికి కోడి కత్తి కేసు నిందితుడు కూడా బెయిల్‌పై బయటే ఉన్నారు. మరికొన్ని కేసుల్లో నిందితుల గుర్తింపే పూర్తి కాలేదు. ఇలా సీబీఐ నమోదు చేస్తున్న కేసుల్లో్ నిందితులు బయట తిరుగుతుంటే ఇప్పటివరకూ కేసులు నమోదు కాని వారు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వీరెవరికీ ఇప్పట్లో ఈ కేసులు తేలతాయన్న నమ్మకం కూడా కనిపించడం లేదు.

 బీజేపీకి కూడా నమ్మకం లేదు...

బీజేపీకి కూడా నమ్మకం లేదు...

సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్ద అయిన సీబీఐపై కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు నమ్మకంగా ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీబీఐ దర్యాప్తుకు సై అనేస్తాయి. కానీ ఏపీలో సీబీఐ కేసుల దర్యాప్తుపై మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం పెదవి విరుస్తోంది. తాజాగా అంతర్వేది రథం వ్యవహారంలోనూ బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరుతుండగా... బీజేపీ మాత్రం న్యాయవిచారణ కావాలని కోరుతోంది. జగన్‌ సర్కారు సీబీఐకి కేసును అప్పగించడం ద్వారా ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగేలా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే జ్యుడిషియల్‌ విచారణ చేయించాలని బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి కోరారు.

English summary
andhra pradesh government has handed over antarvedi chariot burning case to cbi. but almost more than half dozen cases inquiry in the state is lasting for long time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X