ఢిల్లీ బహుత్ దూర్హై: కిరణ్ చమత్కారం, టిపై 32మంది
హైదరాబాద్: ఢిల్లీ వెళ్లే విషయమై విలేకరులు ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'చాలా దూరం ఉంద'ని చమత్కరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లాబీల్లో ముఖ్యమంత్రి కనిపించినప్పుడు విలేకరులు ఆయనను పలకరించారు.
తాను మరో గంటన్నర పాటు తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో మాట్లాడుతానని చెప్పారు. ఢిల్లీ ఎప్పుడెళ్తున్నారని ప్రశ్నించగా... 'ఢిల్లీ బహుత్ దూర్ హై' అంటూ వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానంతో చర్చించేందుకు కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీ వెళ్లవలసి ఉంది.
శాసన సభ ఉన్నందున తాను ఢిల్లీకి రావడం లేదని కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్కు ఫోన్ చేసి చెప్పారు. బొత్స మాత్రం ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే, విభజనకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నందున అసంతృప్తితోనే కిరణ్ వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది.
కాగా, తెలంగాణ ముసాయాదా బిల్లు పైన ఇప్పటి వరకు 32 మంది శాసన సభ్యులు శాసన సభలో మాట్లాడారు. ఒక్కో సభ్యునికి ఐదు నిమిషాల సమయం ఇస్తున్నట్లు సభాపతి నాదెండ్ల మనోహర్ గురువారం తెలిపారు. పలు పార్టీలకు చెందిన సభ్యులు ప్రసంగించారు.