ఏపీ జిల్లాపై తెలంగాణా నుండి డిమాండ్; కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలన్న వీహెచ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న జగన్ సర్కార్ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇదే సమయంలో జిల్లాల పేర్లు కూడా ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై వివిధ జిల్లాలలోని నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, కొన్ని చోట్ల కొత్త ఆకాంక్షలు పుట్టుకొస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్నిచోట్ల నిరసనలు, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
తెలంగాణ నుంచి కూడా ఏపీ జిల్లాల విషయంలో ఒక కొత్త డిమాండ్
చారిత్రక ప్రాధాన్యం, సకల సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాలను కాదని వేరే చోట్ల జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కొన్ని జిల్లాల పేర్లు పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇక తాజాగా ఏపీ జిల్లాల పునర్విభజనపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రాలపై ఇప్పటికే కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్న క్రమంలో తెలంగాణ నుంచి కూడా ఏపీ జిల్లాల విషయంలో ఒక కొత్త డిమాండ్ తెరమీదకు వచ్చింది.
కొత్త డిమాండ్ ను తెరమీదకు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు ఏపీ జిల్లాల విషయంలో కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకువచ్చారు. కర్నూలు జిల్లాకు ఆ జిల్లాకు చెందిన సంజీవయ్య పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎంతో పని చేశారని ఆయన గుర్తు చేశారు. అందుకే కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి కోరుతున్నట్లుగా వి హనుమంత రావు వెల్లడించారు.
కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలనే ఆలోచన రాకపోవడం సిగ్గుచేటు
కడపకు వైయస్ఆర్, విజయవాడకు ఎన్టీఆర్, మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన జగన్ కు కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలనే ఆలోచన రాకపోవడం సిగ్గుచేటు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ దీనిపై పునరాలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న నేతలు సైతం జగన్ పై ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని వి హనుమంత రావు వెల్లడించారు.
కడప, చిత్తూరు జిల్లాలలో నిరసన సెగలు
ఇదిలా ఉంటే ప్రస్తుతం కడప జిల్లాలో రాజంపేట కాదని రాయచోటి జిల్లా కేంద్రం చేయడంపై అక్కడి నాయకులు పార్టీలకతీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పురపాలక సంఘం కార్యవర్గం మొత్తం రాజీనామాకు సిద్ధపడిన జిల్లా మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిలో కలపటం ఏమిటని ఆ ప్రాంతంలో సైతం నిరసన మంటలు చెలరేగుతున్నాయి.
కృష్ణాజిల్లా, విశాఖలోనూ అసంతృప్తి
మరోపక్క గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కృష్ణాజిల్లాలో కలవడంపై ఆ ప్రాంత వాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న శృంగవరపుకోటను విజయనగరం లో కలపటం, నర్సీపట్నం అన్ని చేయకపోవడంపై ఆయా ప్రాంతాల్లో అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి. అటు ప్రతిపక్ష పార్టీల నాయకులే కాకుండా అధికార పక్ష ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.