తేల్చిన బాబు, పవన్ ప్రశ్నిస్తారా: చౌహాన్ చేతిలో హోదా, కెసిఆర్ ఏం చేస్తారు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం వేడెక్కుతోంది. హోదా లేదా ప్రత్యేక సాధిస్తామని ఓ వైపు తెలుగుదేశం, బిజెపి నేతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై బిజెపి వెనకడుగు వేసిందని, దీనిపై టిడిపి ఘాటుగా ఎందుకు స్పందించడం లేదని వైసిపి, కాంగ్రెస్, వామపక్షాల నేతలు తదితరులు ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి రావు జితేందర్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి - బిజెపిలకు సార్వత్రిక ఎన్నికల సమయంలో మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారని చెప్పవచ్చు. కేంద్రంతో ఘర్షణపూరిత వాతావరణంతో కాకుండా స్నేహంగా వెళ్లి నిధులు, అలాగే హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ సాధించాలని అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పైన అందరి దృష్టి ఉంది.
రాజధాని భూమి, ప్రత్యేక హోదా పైన టిడిపి, కాంగ్రెస్ ఎంపీలను నిలదీసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు బిజెపిని, ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే సమయం వచ్చిందని అంటున్నారు. నటుడు శివాజీ సహా పలువురు పవన్ బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, బిజెపి నేతలు, కొందరు టిడిపి నేతలు మాత్రం ఇంకా ప్రత్యేక హోదా పైన ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యక హోదా సాధిస్తామని చెబుతున్నారు. కొందరు మాత్రం హోదా కాకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ప్యాకేజీ సాధిస్తామని చెబుతున్నారు.
ప్రత్యేక హోదాపై ఆశలెందుకు?
పలువురు ఏపీ నాయకులు ఇంకా ప్రత్యేక హోదా పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రి చెప్పినప్పటికి అది ఏపీకి వర్తించదని చెబుతున్నారు. ఎందుకంటే విభజన సమయంలో ఏపీకి నాటి ప్రధాని ఇచ్చిన హామీ అంటున్నారు.
అలాగే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, విభజన తర్వాత ఏపీ తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయింది. అంతేకాకుండా, ఏపీ ప్రజలకు ఇష్టం లేకుండా విభజన జరిగింది. వీటిని పరిశీలిస్తే ఇంకా హోదా పైన ఆశలు ఉన్నాయనే వారు లేకపోలేదు.
ముఖ్యంగా, ప్రత్యేక హోదా పైన నాటి ప్రధాని మన్మోహన్ హామీ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అంటే బిజెపి పదేళ్లు అంటూ పట్టుబట్టిందని, ఈ నేపథ్యంలో బిజెపి పైన ఎక్కువ బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ కారణాలతో హోదా గురించి ఎలా చెప్పినప్పటికీ ఇవ్వడం మాత్రం ఖాయమంటున్నారు.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్టారనికి వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అది బీహార్ ఎన్నికల దృష్ట్యానే అని చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే అక్కడ బిజెపికి నష్టం జరుగుతుంది. ఈ కారణంగానే ఆ పార్టీ ప్రస్తుతానికి అలా చెప్పి ఉంటుందనే వారు లేకపోలేదు. పలువురు నేతల ధీమా వెనుక అసలు కారణం ఇదే అంటున్నారు.
ప్రత్యేక హోదా మధ్యప్రదేశ్ సీఎం చేతిలో... అలా వస్తుందా?
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల్లో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. నీతి అయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.
తమకు హోదాను తొలగించడంపై 11 రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తూ.. పునరుద్ధరించాలని పట్టుబడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలు ఏప్రిల్ 1 నుంచి హోదా కోల్పోయాయి. చౌహాన్ నేతృత్వం వహిస్తున్న సబ్ కమిటీలో ఉన్న ఈ రాష్ట్రాల సిఎంలు హోదా తమకు కావాలని పట్టుబడుతున్నారు.
దీంతో చౌహాన్ హోదాపై సిఫార్సు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీని ఆధారంగా కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. అప్పుడు విభజన సమయంలో సాక్షాత్తూ ప్రధాని చేసిన ప్రకటనను గౌరవిస్తూ, ఏపీకి కూడా ఇవ్వవచ్చంటున్నారు.
ప్రత్యేక హోదాను కొనసాగించాలని 11 రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తోంది. హోదా పునరుద్ధరణ ఆలోచన వస్తే మరిన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తాయి. కాగా, ఈ సబ్ కమిటీలో కెసిఆర్ కూడా సభ్యుడిగా ఉన్నారు. కానీ ఆయన ఒక్కసారి కూడా కమిటీ సమావేశాలకు హాజరుకాలేదు.
ప్రత్యేక హోదాపై...
కేంద్ర పథకాల్లో ప్రభుత్వం వాటా 90 శాతం కాగా, రాష్ట్రం వాటా 10 శాతంగా ఉండేది. ఇప్పుడు 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇస్తున్నందున, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి సంస్కరణలు అవసరం? తదితర కీలక అంశాలపై సిఫార్సు చేయాలని మార్చి 9న చౌహాన్ కమిటీకి నిర్దేశించారు.
నివేదికను సమర్పించేందుకు మూడు నెలల గడువు పెట్టారు. కమిటీ ఇప్పటి వరకు పలుమార్లు సమావేశమైంది. నివేదిక ఇవ్వలేదు. మరో నెలలో నివేదిక ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. చౌహాన్ కమిటీ నివేదిక వచ్చాక హోదాతో పాటు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన రావొచ్చు.