ఎపిలో కుండపోత: పొంగిపొర్లుతున్న వాగులు, జాలర్ల గల్లంతు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతోపాటు నైరుతి రుతిపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీని వల్ల తెలుగురాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాజమండ్రిలో భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రావులపాలెంలో మండలంలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షబీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమలాపురం మెట్లకాలనీ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. తునిలో కొండవారిపేటలో తాండవ నది పొంగిపొర్లుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బైనేరు, జల్లేరు, సుద్దకల్వ, పెద్దకల్వ వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫిరంగిపురం మండలం మందులపాలెంలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు.

గురువారం సాయంత్రం నుంచి కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో 10 సెంటీమీటర్లు, గన్నవరం ఎయిర్పోర్టు వద్ద, విశాఖపట్నం ఎయిర్పోర్టు వద్ద ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. అల్పపీడనం వాయుగుండంగా మారిన తరువాత కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
కొత్తవలస-కిరండల్ రైలు మార్గంలో విశాఖ ఏజెన్సీలోని కరకవలస, బొర్రా స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో రైల్వే శాఖకు భారీ నష్టం వాటిల్లింది. గురువారం రాత్రి నుంచి ఈ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురస్తోంది. దీంతో రైల్వే ట్రాక్ను ఆనుకుని ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ రద్దయింది. మధ్య ప్రదేశ్లోని హిటాచి వద్ద కేబుల్ దగ్ధం కావడంతో విశాఖ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ వెళ్లలేదు. అలాగే ఢిల్లీ నుంచి రావల్సిన స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ కూడా రద్దయినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలియచేశారు.
చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన కాకినాడకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. 17వ తేదీ ఉదయం వేటకు వెళ్లిన వీరు రాత్రికి గల్లంతయ్యారు. శుక్రవారం బోటు యజమాని పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ నగర శివారు మత్స్యకార ప్రాంతం దుమ్ములపేటకు చెందిన వాసుపల్లి కృష్ణ అనే వ్యక్తి బోటుపై ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.
బైరవపాలెం సమీపంలోని రిలియన్స్ రిగ్ సమీపంలో వేట సాగిస్తుండగా 17వ తేదీ రాత్రి 12గంటల సమయంలో బోటుతోపాటు గల్లంతయ్యారు. వేటకు వెళ్లిన తమవారు తిరిగి రాకపోవడంతో బోటు యజమాని వాసుపల్లి కృష్ణ శుక్రవారం మెరైన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మెరైన్ పోలీసులు ఈ సమాచారాన్ని కోస్టుగార్డు అధికారులకు తెలపడంతో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చేపట్టారు.
ఎడతెరిపి లేకుండా గురువారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షానికి చింతూరు మండలంలోని వాగులు ఉద్ధృత రూపం దాల్చాయి. చంద్రవంక, జల్లిగూడెం వాగుల నుండి రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చంద్రవంక వాగు ఉద్ధృతరూపం దాల్చడంతో చట్టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి - 30 పైకి వరద నీరు చేరింది. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణా వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
చంద్రవంక వాగు ఉద్ధృతి తగ్గకపోవడంతో నడుం లోతు నీటిలోనే వాగు దాటారు. వాగు దాటుతున్న బోర్వెల్ లారీ ఒకటి బోల్తాపడింది. డ్రైవరు, క్లీనర్ సురక్షితంగా తప్పించుకున్నారు. రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వాగు దాటుతున్న సమయంలో మధ్యలో నిలిచిపోయింది. చింతూరు సిఐ దుర్గారావు, ఎస్ఐ గజేంద్రకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును వాగు నుండి వెలుపలకు తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications