బెదిరిస్తే బాలయ్య సైతం వైసీపీలోకే: ఆ ఇద్దరే మిగిలేది: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..!
టీడీపీ నుండి వైసీపీలోకి వలసల పైన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ తలుపులు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో టీడీపీలో చివరకు మిగిలేది చంద్రబాబు...ఆయన తనయుడు లోకేష్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇక, బాలకృష్ణ ను సైతం ఆ రకంగా బెదిరిస్తే ఆయన సైతం వైసీపీలోకి వచ్చేస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. మరో ఎమ్మెల్యే ఒకటి రెండో రోజుల్లో సీఎంతో కలుస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఆ కేసులో బెదిరిస్తే బాలయ్య సైతం..
టీడీపీ నుండి వైసీపీలోకి రావటానికి ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన బాలకృష్ణ గురించి కీలక కామెంట్లు చేసారు. బాలకృష్ణ సంగతేమిటని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన మీదున్న కేసును రీఓపెన్ చేయిస్తామంటే ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారన్నారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సహాయంతోనే బయటపడ్డారని గుర్తుచేశారు. దీని ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలను బెదిరింపులతో చేర్చుకుంటున్నారా అనే ప్రశ్నలకు నారాయణ స్వామి అవకాశం ఇచ్చేలా వ్యాఖ్యలు చేసారనే చర్చ మొదలైంది. అయితే, బాలకృష్ణ గురించి ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది.

వైసీపీలో టచ్ లో మరో ఎమ్మెల్యే...
టీడీపీ నుండి 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఇప్పటికే వల్లభనేని వంశీ.. మద్దాలి గిరి వైసీపీతో టచ్ లో ఉన్నారు. వారు ఇక టీడీపీకి దూరమైనట్లే. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం త్వరలోనే వీరి బాటే పడుతారంటూ వైసీపీలో ప్రచారం సాగుతోంది. ఇక, వైసీపీ డోర్లు ఓపెన్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తాంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు విశాఖ కు పరిపాలనా రాజధాని తరలింపు ద్వారా విశాఖ టీడీపీలో సైతం వలసలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సైతం దగ్గర పడుతుండటంతో రాజకీయంగా ఏపీలో కీలక సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications