కృష్ణుడు-కుచేలుడు: పుట్టినరోజు గిఫ్ట్తో మోడీకి రాయలసీమ షాక్, ఇప్పటికైనా తెలిసేనా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే తమకు అభిమానం అని, ఆయన పుట్టిన రోజు నాడు తమ స్తోమతను బట్టి బహుమతి పంపిస్తున్నామని, ఈ బహుమతితో అయినా ప్రధాని తమ సమస్యలను తెలుసుకోవాలంటున్నారు రాయలసీమ రైతాంగం.
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే తమకు అభిమానం అని, ఆయన పుట్టిన రోజు నాడు తమ స్తోమతను బట్టి బహుమతి పంపిస్తున్నామని, ఈ బహుమతితో అయినా ప్రధాని తమ సమస్యలను తెలుసుకోవాలంటున్నారు రాయలసీమ రైతాంగం.
'అమరావతి'పై బాబు బెదిరింపులో ట్విస్ట్, వైసిపి నేత ఇంట్లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు
ఈ రోజు (ఆదివారం, సెప్టెంబర్ 17) ప్రధాని మోడీ 68వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు రైతులు ఒక్కొక్కరు రూ.0.68 పైసలు (68 పైసలు) చెక్కును మోడీకి పంపిస్తున్నారు. తద్వారా తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.
చెక్కుల సేకరణ
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం రాయలసీమను విస్మరిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు నీరు లేక, పంట పండక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధనా సమితి (ఆర్ఎస్ఎస్ఎస్) సభ్యులు వందలమంది రైతుల నుంచి చెక్కులు తీసుకున్నారు.
మోడీ 68న పుట్టిన రోజుకు 68 పైసలు
మోడీ 68వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కో రైతు 68 పైసల చెక్కు పంపిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లా నుంచే 400కు పైగా చెక్కులు సమకూరినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి పెన్నా వంటి నదులు పారుతున్నప్పటికీ ఏడారిగా ఉందని, పంటకు నీరు లేదని వాపోతున్నారు.
సీమకు ఏమీ లేదు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాయలసీమకు ఎన్నో ప్రాజెక్టులు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ దేనిని పూర్తి చేయలేదని చెబుతున్నారు. పైగా నీటిపారుదల సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని, దీంతో పొలాలకు నీరే రావడం లేదంటున్నారు. సీమకు అటు ఇండస్ట్రీలు రావడం లేదు, ఇటు పరిశ్రమలు రావడం లేదంటున్నారు.
ఈ హామీలేమయ్యాయి?
కడపకు స్టీల్ ప్లాంట్, గుంతకల్లుకు రైల్వే జోన్, కేంద్ర సంస్థలు రావాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మహాభారతంలో కుచేలుడిని గుర్తు చేస్తున్నారు. కుచేలుడు చాలా పేదవాడు అని, తన స్నేహితుడు కృష్ణుడికి అటుకులు మాత్రమే తీసుకు వెళ్లగలిగే ఆర్థిక పరిస్థితి ఆయనది అని, ఇప్పుడు తమది కూడా మోడీకి అలాంటి పరిస్థితి అంటున్నారు.
కుచేలుడికి కృష్ణుడు, మరి సీమకు మోడీ అవుతారా?
నాడు కుచేలుడు కృష్ణుడికి అటుకులు మాత్రమే ఇచ్చినట్లు, తాము మోడీకి తమకు సాధ్యమైన 68 పైసలు మాత్రమే పంపిస్తున్నామని, ఆయన అంటే గౌరవం ఉందని చెబుతున్నారు. దీంతో తమ సమస్యలు ఆయనకు అర్థమవుతాయని భావిస్తున్నామన్నారు. దీనిని చూసైనా తమకు మోడీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని భావిస్తున్నామని అంటున్నారు.