కరోనాలోనూ వైసీపీ రంగులు- హైకోర్టు ఆదేశాలు బేఖాతర్- అడ్డుకున్న జనం...
ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఓ వైపు వణికిపోతుంటే విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం లేదనుకున్నారో ఏమో అధికార పార్టీ నేతలు, అధికారులతో కలిసి పంచాయతీ కార్యాలయానికి పార్టీ రంగులు వేసేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులే తీసేయాలని హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోకుండా వైసీపీ రంగులు వేసేందుకు ప్రయత్నించడంతో స్ధానికులు అడ్డుకున్నారు.
కరోనాలోనూ ఆగని రంగులు..
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ ప్రభావం చూపుతుంటే మరోవైపు ప్రభుత్వం తన కార్యక్రమాలను ఏ మాత్రం వాయిదా వేసుకోవడం లేదు. కనీసం హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గం మాలబొడ్డవరం పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీన్ని స్ధానికంగా ఉన్న గిరిజనులు అడ్డుకున్నారు. కరోనా వేళ ఈ రంగుల పంచాయతీలు ఏంటని నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక మధ్యలోనే వదిలేసి వెనుదిరిగారు. గిరిజన గ్రామమైన మూలబొడ్డవరంలో గత ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం నిర్మాణం జరిగింది.ఆ భవనాన్ని ఆనుకొని సుజల స్రవంతి పథకం ద్వారా వాటర్ ట్యాంక్ కోసం 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వీటికి రంగులు వేసేందుకు చేసిన ప్రయత్నాలు విమర్శలకు దారి తీశాయి.
Recommended Video

ఇప్పటికే పలుచోట్ల వివాదాలు- హైకోర్టు ఉత్తర్వులు..
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు అద్దేశారు. వీటి కోసం దాదాపు 1400 కోట్లు ఖర్చుపెట్టారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడం, కేసులు కూడా దాఖలు కావడంతో హైకోర్టు వీటిని తప్పుబట్టింది. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. దీంతో మళ్లీ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి రంగులు మార్చాల్సిన పరిస్దితి నెలకొంది. ఇలాంటి సమయంలో హైకోర్టు ఉత్తర్వులను కానీ, కరోనా లాక్ డౌన్ ను కానీ పట్టించుకోకుండా హడావిడిగా పంచాయతీ కార్యాలయానికి రంగులు వేసేందుకు చేసిన ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications