బీహార్ ప్రజలు తీర్పు.. ప్రధాని మోడీకి చెంపపెట్టు: దేవినేని అవినాష్
పాట్నా: బీహార్ ప్రజల తీర్పు ప్రధాని నరేంద్రమోడీకి చెంపపెట్టు లాంటిదని ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం నాడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మాహాకూటమి ఘన విజయం సాధించింది.
మాహాకూటమిలో జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. మహాకూటమి విజయం సాధించడంతో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మోడీ మాటల జిమ్మిక్కులను ప్రజలు అర్ధం చేసుకున్నారనడానికి బీహార్ ఎన్నికలే నిదర్శనమన్నారు. కాగా, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి సాధిస్తే సంబరాలు చేసుకుంటామని గతంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో, యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఏపీలో గెలవకపోయినా, దేశంలోనే ఎంతో కీలకమైన బీహార్లో తమ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధించడం యుత్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
ఇక పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా బీహార్లో మహా కూటమి విజయంపై హర్షం ప్రకటించారు.