రంగా హత్యపై వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం: వెంకన్న నెహ్రూ లీగల్ నోటీసు
విజయవాడ: మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆత్మకథ ద్వారా బెజవాడ రాజకీయంలో చిచ్చు పెట్టారు. మోహనరంగా హత్య విషయంలో చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ లీగల్ నోటీసు జారీ చేశారు.
వంగవీటి మోహనరంగా హత్య కేసులో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరుతూ నెహ్రూ వివరణ కోరారు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య రాసిన పుస్తకంలో 1988లో జరిగిన రంగా హత్య కేసుకు సంబంధించి ప్రస్తావించిన అంశాలు వివాదం సృష్టించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్, టిడిపి నేతలు దీనిపై పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసారు. చంద్రబాబుపై సీబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ వెంకన్న స్పందిస్తూ రఘువీరాపై ధ్వజమెత్తారు.

రంగా కేసులో ముద్దాయిగా ఉన్న నెహ్రూను పక్కన కూర్చోపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సీబీఐ విచారణ జరిపించమనటంలో ఔచిత్యం ఏముందని ఆయన రఘువీరాను ప్రశ్నించారు. అప్పట్లోనే సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థనరెడ్డి మంత్రివర్గంలో రఘువీరా రెడ్డి మంత్రిగా ఉన్న విషయాన్ని వెంకన్న గుర్తు చేశారు.
సీబీఐ చార్జ్ షీటులో చంద్రబాబు పేరు ఎక్కడా ప్రస్తావించలేదని వెంకన్న ఆ సమయంలో మీడియాతో అన్నారు. ఆ కేసు కూడా కొట్టివేసిన విషయాన్ని మరిచి రఘువీరారెడ్డి రాజకీయాల కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా ఏనాడో ముగిసిన రంగా హత్య కేసులో తన పేరును ప్రస్తావించినందుకు నెహ్రూ ఆగ్రహంతో వెంకన్నకు నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి ఇంకా వెంకన్న బదులు ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications