'హెరిటేజ్లో నాకూ షేర్లు, 25లక్షలకు అమ్ముకున్నా, లోకేష్పై జగన్ దుష్ప్రచారం'
హెరిటేజ్ సంస్థను స్థాపించినప్పుడు తాను అందులో రూ.50ల విలువైన షేర్లు కొన్నానని, వాటిని 2015లో రూ.25లక్షలకు అమ్మేశానని నెహ్రూ చెప్పారు.
విజయవాడ: అసాధారణ రీతిలో లోకేష్ ఆస్తుల విలువ పెరిగిందంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో కథనం రావడంతో.. టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా ఆ ఆరోపణలను తిప్పికొట్టారు.
ఇప్పటికే టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఆ ఆరోపణలపై వివరణ ఇవ్వగా.. ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ ఈరోజు సాక్షి కథనాన్ని తిప్పికొట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన నెహ్రూ.. సొంత మీడియా అండతో లోకేష్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలను వాటిని విశ్వసించడం లేదని అన్నారు.
హెరిటేజ్ సంస్థను స్థాపించినప్పుడు తాను అందులో రూ.50ల విలువైన షేర్లు కొన్నానని, వాటిని 2015లో రూ.25లక్షలకు అమ్మేశానని నెహ్రూ చెప్పారు. తాత, తండ్రుల నుంచి వచ్చే ఆస్తుల రేట్లు పెరగవా అని ప్రశ్నించారు.
ఇక వైఎస్ జగన్ గురించి ప్రస్తావిస్తూ.. 'మీ నాన్న సీఎం అయినప్పుడు నీ ఆస్తి ఎంత? ఆయన చనిపోయే నాటికి నీ ఆస్తి ఎంత? అంటూ జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.1500కోట్లు అని గుర్తుచేశారు. అందులో చాలా వాటిని ఈడీ జప్తు చేసినా,, కనీసం రూ.కోటి కైనా జగన్ కౌంటర్ దాఖలు చేయగలిగారా? అని ప్రశ్నించారు.
అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం జగన్ కు ఏమాత్రం ఇష్టలేదని, అందుకే రాజధాని రైతుల ప్రేమగా అన్నం పెట్టినా.. తినకుండా వెళ్లిపోయారని విమర్శించారు.