గోదావరి వరదలొస్తే జెరూసలెం .. కృష్ణా వరదలకు అమెరికా వెళ్ళిన సీఎం జగన్.. ఇదేనా పాలన అన్న దేవినేని ఉమా
ఏపీ సీఎం జగన్ పాలనపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లో పరిపాలన జగన్ గాలికొదిలేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదికి వరదలు వచ్చి ఉభయగోదావరి జిల్లాలలో వరదలు ముంచెత్తిన సమయంలో ముంపుకు గురైన గ్రామాల ప్రజల అవస్థలు పడుతుంటే జగన్ జెరూసలెం వెళ్లారని , ఇప్పుడు కృష్ణానదికి వరదలు వస్తే అమెరికా వెళ్లారని.. ఇది ఏపీ సీఎం పనితనం అని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు.

లోకేష్ వరద ముంపు ప్రాంతాలు పర్యటిస్తే అప్పుడు ఏరియల్ సర్వే చేసిన జగన్ ... దేవినేని మండిపాటు
మాజీ మంత్రి నారా లోకేష్ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించారని తెలుసుకున్న తర్వాత జగన్ ఏరియల్ సర్వే చేశారని అప్పటివరకు ముంపు గ్రామాల ప్రజల గురించి జగన్ కు పట్టలేదని విమర్శించారు దేవినేని ఉమా. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నారా లోకేష్ ముంపు గ్రామాల ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇచ్చారని దేవినేని పేర్కొన్నారు. ఏరియల్ సర్వే చేసిన జగన్ ముంపు గ్రామాల ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల కోసం ఏమీ చేయకుండా, ఏమీ చెప్పకుండా మిన్నకున్నారు అని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా కృష్ణానదికి వరదలు వస్తే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టనట్టు సీఎం జగన్ అమెరికాలో పర్యటిస్తున్నారంటూ మండిపడ్డారు .

సూటు బూటు వేసుకుని సొంత పనుల కోసం అమెరికాలో పర్యటించడానికా ప్రజలు అధికారం ఇచ్చిందన్న ఉమా
రాష్ట్రంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక సీఎం హోదాలో ఉండి సొంత పనుల కోసం అమెరికాలో పర్యటించడం అవసరమా అంటూ దేవినేని ఉమా ప్రశ్నించారు. ఒకపక్క రాయలసీమ రైతన్నలకు నీళ్లు లేక గొంతెండు తుంటే, మరోపక్క వరదలతో జనజీవనం అతలాకుతలం అవుతుంటే.. ప్రజలు నానా బాధలు పడుతున్నా పట్టించుకోకుండా సూటు బూటు వేసుకుని సొంత పనుల కోసం అమెరికాలో పర్యటించడానికా ఏపీ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు దేవినేని ఉమా. మాటలు చెప్పినంత ఈజీ కాదు పనిచేయడం అంటే అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఇల్లు తప్ప వరదల్లో మంత్రులకు మరే ఇల్లు కనిపించలేదా .. దేవినేని ఆగ్రహం
జగన్ అమెరికాలో తిరుగుతుంటే రాష్ట్ర మంత్రులు సన్మానాలు చేయించుకుంటూ ప్రజల దుర్భర పరిస్థితుల్లో ఉన్న పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ1 అమెరికాలో ఉంటే ఏ2 న్యూఢిల్లీలో ఉన్నారని ఇకపోతే ఏ3 సెర్బియాలో ఉన్నారంటూ ఎద్దేవా చేసిన దేవినేని ఉమా చంద్రబాబు నాయుడుని టార్గెట్ గా చేసుకొని ఆయన ఇంటిని ముంచడం కోసం అదే పనిగా మంత్రులు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇల్లు తప్ప వరద ముంపుకు గురైన మరే ఇల్లు కనపడలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలను నాశనం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని ఉమా.

మూర్ఖపు ప్రభుత్వం ..ప్రజల ఉసురు తగులుతుంది అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన దేవినేని
చెబితే వినరు, తెలుసుకుని అయినా చేయరు అంటూ వైసిపి ప్రభుత్వ మూర్ఖత్వం ప్రభుత్వమని మండిపడ్డారు. 275 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమా ప్రభుత్వం చాలా అసమర్ధంగా వ్యవహరించింది అంటూ దుయ్యబట్టారు.
రీ టెండర్పై ఉన్న శ్రద్ధ వరదల నియంత్రణపై లేదని జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన ఉమా గత రెండు నెలలుగా పోలవరంలో ఒక్క పని కూడా చేపట్టలేదంటూ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గేట్లు ఎత్తితే మన మంత్రులు వెళ్లి పూజలు చేశారని, ఇక పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తితే పక్క రాష్ట్ర అధికారులు ఎందుకు కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేశారో చెప్పాలని ఉమా ప్రశ్నించారు. ఇంత మూర్ఖపు ప్రభుత్వానికి ప్రజల ఉసురు తగులుతుందని దేవినేని ఉమ శాపనార్ధాలు పెట్టారు.












Click it and Unblock the Notifications