ఆందోళన... అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశి గురువారం వస్తుండటం... కొత్త సంవత్సరం.. జనవరి ఒకటో తేదీ.. అన్నీ కలిసి రావడంతో సామాన్య భక్తులు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
దీంతో తమకు బుధవారం నుంచే వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతించాలని భక్తులు తిరుమలలోని సీజీసీ వద్ద ఆందోళనకు దిగారు. ఐతే బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే భక్తులను వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. దాంతో అధికారులకు, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను రద్దు చేశారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ద్వారం నుంచి భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దేవదేవుడు బంగారు రథంపై తిరుమల మాడవీధుల్లో విహరించనున్నారు.