సాక్ష్యాలు సేకరించాం: తుని ఘటనపై డిజిపి, బిజెపి నేత కన్నా పైనా కేసు
విజయవాడ: కాపు గర్జన నేపథ్యంలో జరిగిన తుని విధ్వంసం పైన ఆంధ్రప్రదేశ్ డిజిపి జేవీ రాముడు బుధవారం నాడు స్పందించారు. ఈ ఘటనను సభ్య సమాజం అంగీకరించదని చెప్పారు. తుని ఘటనలో గాయపడిన పోలీసులను ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడారు.
ప్రభుత్వ, ప్రజల ఆస్తుల ధ్వంసానికి కుట్రదారులను శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దీని పైన తాను పరుషంగా మాట్లాడి మరింత వివాదం రేపాలని భావించడం లేదని చెప్పారు. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించామని ఆయన చెప్పారు.
వాస్తవాల ఆధారంగా విచారణ జరుపుతున్నామన్నారు. దోషులను శిక్షిస్తామన్నారు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో మీడియా చూసిందన్నారు. దీని పైన ఎవరు ఎలా మాట్లాడినా వాస్తవాలు వెలికి తీస్తామన్నారు. ఈ ఘటనలో నిర్దోషులను ఇబ్బంది పెట్టమని, దోషులను వదలమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
కాగా, తుని ఘటన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంతో పాటు పలు పార్టీలకు చెందిన 27 మంది నాయకుల పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో ముద్రగడను ఏ1గా చేర్చారు. ముద్రగడతో పాటు మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు, వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, ఆకుల రామకృష్ణ, అంబటి రాంబాబు, జ్యోతుల నెహ్రూ, బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, అడపా నాగేంద్ర, నల్లా విష్ణు, కాంగ్రెస్ నేత వట్టి వసంత్ కుమార్, వాసిరెడ్డి యేసుదాసు, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి మోహన్ రావు, తెలంగాణ నేత వి హనుమంత రావు, సుబ్బారావు, దాడిశెట్టి రాజా, గంగాభవాని, సినీ నటుడు జీవీ సుధాకర్, నల్లా పవన్, కాంగ్రెస్ పార్టీ నేత తాతాజీ, టిడిపి నేత బండారు శ్రీనివాస రావు, వైసిపి నేత ముత్యాల వీరభద్ర రావు, ఓ చానల్ ఎండీ నాయుడు, దూలిపూడి చక్రం, బిజెపి నేత, ఏఎల్డీఏ చైర్మన్ దొరబాబు, ఆలేటి ప్రకాశ్ తదితరులపై కేసు నమోదయినట్లుగా తెలుస్తోంది.