ఏపీ డీజీపీ అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు...రేపటిలోగా విశాఖకు చేరిక
అమరావతి:ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తన అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించికొని స్వదేశానికి పయనమయ్యారు. శిక్షణ నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఎపిలో అనూహ్య పరిణామాలు రీత్యా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని ఎపికి తిరిగివస్తున్నారు.
డిజిపి ఫ్లైట్ టికెట్ లభ్యతను బట్టి ఈరోజు లేదా రేపు ఉదయానికి హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. డీజీపీ అక్కడి నుంచి నేరుగా విశాఖపట్టణం బయలుదేరి వెళతారని తెలిసింది. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య నేపథ్యంలో ఘటన సమాచారం అందినప్పటినుంచి డీజీపీ అక్కడి పరిస్థితుల విషయమై విశాఖ, అరకు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వారికి తగిన ఆదేశాలు ఇస్తున్నారు.
మరోవైపు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు దారుణంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య జరిగిన తర్వాత జరిగిన అల్లర్లను నివారించడంలో ఎస్ ఐ పూర్తిగా విఫలం అయ్యారని పేర్కొంటూ ఏజెన్సీలోని డుండ్రిగూడ ఎస్.ఐ అమర్ నాథ్ ని డిజిపి ఆర్.పి ఠాకూర్ సస్పెండ్ చేశారు.
ఈ విషయం ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్ చేశామని డీజీపీ ఆర్పీఠాకూర్ చెప్పారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై మావోయిస్టుల ఘాతుకం తర్వాత వారి బంధువులు,అనుచరులు పోలీస్ స్టేషన్ లపై దాడికి పాల్పడటం, నిప్పు పెట్టడం ,విధ్వంసకర చర్యలకు పాల్పడటంతో పాటు పోలీసులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై విశాఖ ఆపరేషన్స్ విభాగం ఓఎస్డీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ ఠాకూర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోందని డిజిపి ఠాకూర్ వెల్లడించారు. మరణించిన ఇద్దరు నేతలకు నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.