కనక దుర్గమ్మ కరుణతో ధర్మం గెలిచింది...వెనుకడుగు వేసేదే లేదు:స్వామి పరిపూర్ణానంద
విజయవాడ:హైదరాబాద్ పోలీసులు తనను నగరం నుంచి బహిష్కరించినా...కనక దుర్గమ్మ కరుణతో న్యాయస్థానంలో ధర్మం గెలిచిందని స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ పోలీసులు ఆయనపై విధించిన నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో స్వామి పరిపూర్ణానంద కాకినాడ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆయన విజయవాడ కనకదుర్గమ్మను మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పరిపూర్ణానంద స్వామికి అధికారులు, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. దుర్గమ్మ సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గమ్మకు...విన్నవించా
అనంతరం స్వామి పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడుతూ తనపై బహిష్కరణ అంశం జరిగిన వెంటనే తాను విజయవాడ రావడం...కనక దుర్గమ్మకు తన విన్నపం సమర్పించుకున్నానన్నారు. ఆమె పాదాల వద్ద పెట్టానన్నారు. ఆమె ఫలితం ఏ రకంగా ఇస్తే దానికి తగ్గట్టుగా ప్రవర్తిద్దామని అనుకున్నానన్నారు.
తెలంగాణా వెళ్లాలని...అమ్మ ఆజ్ఞ
ఆమె కరుణతో ధర్మం గెలిచిందని...తెలంగాణా వెళ్లాలనేది అమ్మ ఆజ్ఞ అని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. అది తిరుగులేని అమ్మ వారి అనుజ్ఞగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
వెనకడుగు...వేసేదే లేదు
లక్షలాది మంది తెలంగాణా, ఆంధ్రా ప్రజలు నానుండి ఏం కోరుకుంటున్నారో ఆ ధర్మం కోసం...ఆ సంస్కృతి...వాటి పరిరక్షణ కోసం పాటుపడుతూనే ఉంటానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. అసలు తాను సన్యాసం తీసుకుందే అందుకోసం అన్నారు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
హిందూ ధర్మం...జీవితం అంకితం
హిందూ ధర్మం కోసం తన జీవితం అంకితమని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని స్వామి పరిపూర్ణానంద పునరుద్ఘాటించారు. బెజవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకునేందుకు విచ్చేసిన స్వామి పరిపూర్ణానంద వెంట హైదరాబాద్ ఉప్పల్ శాసనసభ్యులు ఎన్.వి.ఎస్ ప్రభాకర్ ఉన్నారు.