'ఎమోషనల్ అయ్యాను, అడగడం ధర్మం కాబట్టి, ఇక అది బాబు గారి ఇష్టం'
అడగడం మా ధర్మం.. నాయకుడిగా అంతిమ నిర్ణయం బాబు గారి ఇష్టం. ఆయన మీదైతే నాకెలాంటి కోపం లేదు, కానీ కొంచెం ఆవేదన మాత్రం ఉందని నరేంద్ర పేర్కొన్నారు.
హైదరాబాద్: మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ తర్వాత టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రేగిన సంగతి తెలిసిందే. బాహాటంగానే పలువురు ఎమ్మెల్యేలు అధినేత చంద్రబాబుపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. బొజ్జల గోపాలకృష్ణ లాంటి నేతలు రాజీనామాల దాకా వెళ్లిపోయారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు అండ్ కో.. నయానో, భయానో మొత్తానికి వారి నోటికి తాళం వేశారు. యథావిధిగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం, పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఇదే కోవలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సైతం మంత్రి పదవిపై మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు.

ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా తన రాజకీయ కెరీర్ పై, మంత్రి పదవిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇవ్వనందుకు తన అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనైన మాట వాస్తవమేనని అన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నా.. ఎందుకు తనను పక్కనపెడుతున్నారో తెలియక అనుచరులు బాధపడుతున్నారని తెలిపారు.
తొలి నుంచి పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్నానని, ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే తన ప్రయత్నమని చెప్పారు. మొదటి నుంచి తాను కొంత ఎమోషనల్ అని సీఎంను కలిసిన తర్వాత మరింత ఎమోషనల్ గా ఫీలైన మాట వాస్తవమేనని అన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో సమర్థవంతంగా పనిచేశానని, ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరానని చెప్పారు.
అడగడం మా ధర్మం.. నాయకుడిగా అంతిమ నిర్ణయం బాబు గారి ఇష్టం. ఆయన మీదైతే నాకెలాంటి కోపం లేదు, కానీ కొంచెం ఆవేదన మాత్రం ఉందని నరేంద్ర పేర్కొన్నారు. ఇక నియోజకవర్గంలో వరుసగా గెలుపొందుతూ రావడానికి గల కారణమేంటని అడిగితే.. ప్రజల్లో తనకు పట్టు అని నరేంద్ర సమాధానమిచ్చారు. 30ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలంతా తనకు అండగా ఉంటున్నారని తెలిపారు.
ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా.. తనను సంప్రదిస్తారని, తనవల్ల అయ్యే పనైతే కచ్చితంగా వెనకాడబోనని చెప్పారు. ఒకవేళ జరిగే పని కాకపోతే మాత్రం తనవల్ల కాదని చెబుతానన్నారు. అనుచరులు, ప్రజలు తనతో స్వేచ్చగా మాట్లాడే వాతావరణం తాను కల్పించానని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications