ఏపీకి ఏది ఎక్కడో తెలియదు: నిమ్మల, టీ-ఏపీకి గొడవ: వైసీపీ ఎంపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్ల తమకు రాష్ట్ర రాజధాని ఎక్కడుందో తెలియదని, కుర్చీ ఎక్కడుందో, బల్ల ఎక్కడుందో తెలియదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప లోకసభలో అన్నారు. శాసన మండలి సంఖ్యను పెంచుతూ తీసుకు వచ్చిన సవరణ బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలోనే అన్ని సమస్యలు సవ్యంగా పరిష్కరిస్తే ఇలాంటి బిల్లులు వచ్చి ఉండేవి కావన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సమస్యలు, విభేదాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే తాము విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఖమ్మంను ఆదుకోవాలి: పొంగులేటి
అరవై సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన అన్ని హామీలు కేంద్రం నెరవేర్చాలని కోరారు. విద్యుత్, నీరు.. ఇలా ఏదో విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం చర్యలు తీసుకున్నందుకు సంతోషమేనని, కానీ ముంపు మండలాల ప్రజల బాధను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల టీచర్స్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, కానీ ముంపు మండలాల ప్రాంతాల యువత అందుకు అర్హులు కాదని ఏపీ ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. విభజనతో ఎక్కువ నష్టం జరిగింది ఖమ్మం జిల్లాకే అన్నారు. దీనిని ఆదుకోవాలన్నారు.
పోలవరం ప్రాజెక్ట్కు వ్యతిరేకం కాదు: రవీంద్ర నాయక్
తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రవీంద్ర నాయక్ అన్నారు. అయితే, ముంపు మండలాలలోని గిరిజనులను ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే తాము ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీల సంఖ్యను 50 నుండి 58కి పెంచే బిల్లుకు కూడా తాము వ్యతిరేకం కాదన్నారు
సున్నిత అంశం: కిరణ్ రిజిజు
సున్నిత అంశాల పట్ల అనవసర రాద్ధాంతం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోకసభలో అన్నారు. తెలంగాణ, ఏపీ.. ఇరు రాష్ట్రాల సమస్యలను తాము పరిగణలోకి తీసుకున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన అన్నారు. కాగా, ఏపీ శాసన మండలి సభ్యుల సంఖ్యను పెంచే సవరణ బిల్లు లోకసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.