కెసిఆరే చెప్పారు.. ఆయనిష్టం, మాట్లాడం: విలీనంపై డిగ్గీ
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తే తన పార్టీని విలీనం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావే చెప్పారని, విలీనం వారిష్టమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం చెప్పారు.
ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామని ఆ పార్టీయే చెప్పిందన్నారు. పొత్తులపై తెరాస వేసిన కమిటీని తాము స్వాగతిస్తామని చెప్పారు. తెరాస నిర్ణయాలు తమపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. విలీనాన్ని తిరస్కరించడం తెరాస, కెసిఆర్ ఇష్టమని, దానిపై తాము ఏమీ మాట్లాడమని చెప్పారు. త్వరలో రెండు పిసిసిలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

డిగ్గీతో పనబాక, రేణుకా
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిలు భేటీ అయ్యారు. తెలంగాణకు ప్రత్యేక పిసిసిని ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలు డిగ్గీని కోరారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ కూడా భేటీ అయ్యారు.
కాగా, కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను దిగ్విజయ్ సింగ్ శాంత పర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత తరుణంలో కాస్త సంయమనం పాటించాలని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా మార్గనిర్దేశం మేరకు ముందుకు సాగుదామని సూచిస్తున్నారు.
నిన్న దిగ్విజయ్ సింగ్తో షబ్బీర్, జానారెడ్డి ఫోన్లో మాట్లాడారు. కెసిఆర్ వ్యాఖ్యలను, దిగ్విజయ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ విషయాలన్నింటినీ సోనియా దృష్టికి తీసుకువెళ్తానని, అంతవరకు సంయమనం పాటించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ సూచించారు. తెరాసతో కాంగ్రెస్ సంబంధాల గురించి ప్రస్తుతానికి మరిచిపోయి ప్రజల్లోకి వెళ్లాలని, మునిసిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు దిగ్విజయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications