బాబుకు 'బెజవాడ' కోపం: సీఎం సింగపూర్, జగన్ కడపపై దిగ్విజయ్
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడ అద్దెల పైన పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బెజవాడకు రావాలంటే అధికారులు భయపడుతున్నారని, అద్దెల విషయంలో ఇక్కడి ప్రజలు పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.
గతంలో రెండుమూడుసార్లు చంద్రబాబు విజయవాడ అద్దెలపై మాట్లాడారు. శుక్రవారం కూడా మరోసారి స్పందించారు. సింగపూర్ తదితర ప్రాంతాల్లో వ్యాపారాలు చాలా సులభమని, కానీ విజయవాడలో మాత్రం అక్కడి కంటే ఎక్కువ అద్దెలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగపూర్లో వ్యాపారం సులభమని, బెజవాడలో మాత్రం కష్టంగా ఉందన్నారు. అద్దెల మీద డబ్బులు సంపాదించుకుంటే సమస్య వస్తుందని, వ్యాపారం చేసి సంపాదించుకోవాలన్నారు. అద్దెలు, ధరలు బాగా పెరుగుతున్నందునే విజయవాడలో పెద్దగా పరిశ్రమలు రాలేదన్నారు. అదే బెజవాడ వాళ్లు ప్రపంచమంతా పెట్టుబడులు పెడతారన్నారు. బెజవాడ అంటేనే అధికారులు భయపడుతున్నారన్నారు.

జగన్, చంద్రబాబులపై దుమ్మెత్తిపోసిన దిగ్విజయ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నాడు దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు సింగపూర్ కంపెనీల వెంట ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
సమర్థమైన కంపెనీలు మన దేశంలో ఉన్నాయని, ఆయినా ఆయన సింగపూర్ కంపెనీల వెంట పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కేబినెట్లో ఎస్సీలు, మైనార్టీలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
వైయస్ జగన్ కడప గురించి ఎప్పుడైనా గళమెత్తారా అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా ఆయన మాట్లాడలేదన్నారు. సొంత నియోజకవర్గ సమస్యల పైన కూడా జగన్ మాట్లాడటం లేదన్నారు.












Click it and Unblock the Notifications