మనకే నష్టం: దిగ్విజయ్, బాబు విఫలమని..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితిలో ఉందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మేథోమదన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. పదవులకే పరిమితం కాకుండా గ్రామగ్రామానికి వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.
రాష్ట్ర విభజన సమయంలో యూపిఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవడంలో ఏపి సిఎం చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినా, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నష్టం జరిగిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఆ కారణంగానే తిరస్కరిస్తున్నారనే విధంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు.
పిరికిపందలే పార్టీని వీడుతున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమయ్యాయని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications