జగన్పార్టీ రోడ్షోలో అపశృతి, ఎద్దు పొడిచి వ్యక్తి మృతి
కడప/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రోడ్డు షోలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. కడప జిల్లా నందలూరులో ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు బస్టాండు ప్రాంతంలో రోడ్డు షోలో ప్రసంగిస్తుండగా.. ఆ మార్గంలో వెళ్తున్న ఎద్దుల బండి జనాల మీదకు దూసుకు వచ్చింది. డప్పుల మోతకు ఎద్దులు బెదిరిపోయి జనాల మీదకు దూసుకు వచ్చాయి. ఈ ఘటనలో నందలూరు మండలం జొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
158 కంపెనీల పారామిలటరీ బలగాలు
తెలంగాణలో బుధవారం జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు 158 కంపెనీల పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిజిపి ప్రసాదరావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోసం 59 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు, 90 వేల మంది సాధారణ పోలిసులతో బందోబస్తు కల్పించనున్నట్లు చెప్పారు.
అత్యవసర సమయాల్లో స్పందించేందుకు నాలుగు వైమానిదళ హెలికాఫ్టర్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రూ.123 కోట్లు, 89 కిలోల బంగారం సీజ్ చేశామని, 28 వేలకు పైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామన్నారు. 3 లక్షల 7వేల మందిని బైండోవర్ చేసినట్లు డిజిపి తెలిపారు.
విజయవాడ నగరంలోని బాపులపాడు మండలం కొత్తమల్లపల్లిలో టిడిపినేత వల్లభనేని వంశీ ప్రచార వాహనంపై జగన్ పార్టీ కార్యకర్తలు మంగళవారం దాడి చేసిన విషయం తెలిసిందే. మంగళవారం కొత్తమల్లపల్లిలో వల్లభనేని వంశీ ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో గన్నవరంలో జగన్ నిర్వహించిన రోడ్ షో నుంచి తిరిగి ఆటోలో, ట్రాక్టర్లలో వెళ్తున్న జగన్ పార్టీ కార్యకర్తల మైకు సౌండ్ ఎక్కువగా ఉండటంతో టిడిపి కార్యకర్తలు సౌండ్ తగ్గించాల్సిందిగా వారిని కోరారు.
ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ దాడిలో 8 మంది టిడిపి కార్యకర్తలు గాయపడగా, పలు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే గాయపడిన వారిని పిన్నమనేని సిద్దార్థ ఆస్పత్రికి తరలించారు. తమపై జరిగిన దాడికి సంబంధించి ఏలూరు రేంజ్ డిఐజితో పాటు విజయవాడ సిపి, కృష్ణా జిల్లా ఎస్పీకి వంశీ ఫోన్లో ఫిర్యాదు చేశారు.