తెలంగాణతో గొడవ ఇష్టం లేదు, చర్చిస్తాం: చంద్రబాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం తప్ప గొడవ పడటం తనకు ఇష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉన్న సమయాన్ని అభివృద్ధికి వినియోగించుకోవడం అవసరమని అన్నారు.
తమకు ఉన్న సమయాన్ని అభివృద్ది సాధనకు వినియోగించుకోవాలి తప్ప వివాదాల కోసం కాదన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసినప్పుడు తెలంగాణతో గల కృష్ణా జలాల వినియోగ వివాదం గురించి చర్చించారా? అని ఒక మీడియా ప్రతినిది అడగ్గా ‘తెలంగాణతో ఉన్న వివాదాలన్నింటినీ పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం, వివాదానికి దిగటం వలన ఎలాంటి లాభం ఉండదు' అని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఉమాభారతితో చర్చించినట్లు ఆయన చెప్పారు. సమస్యలు సృష్టించటం తనకు మొదటి నుండీ ఇష్టం లేదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఉన్న సమయాన్ని రాష్ట్రాల అభివృద్దికి కేటాయించాలని చంద్రబాబునాయుడు హితవు చెప్పారు. పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటమే మంచి పద్ధతి అని ఆయన అభిప్రాయపడ్డారు.
కృష్ణా, గోదావరి ఏ నది సమస్య ఎదురైనా రాష్ట్ర విభజన చట్టం ద్వారా రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కరించుకోవాలన్నారు. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే రెండు రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని చంద్రబాబునాయుడు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications