Video: పూజారి ఇంట్లో పూజ గదిలో.. పడగ విప్పి బుసలు కొడుతున్న కాలనాగు
వేసవి తాపం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా చుక్కలు చూపిస్తోంది. చల్లదనం కోసం పాములు జనావాసాల్లోకి రావడం సహజమే అయినా.. కోనసీమ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. సాక్షాత్తు సీతారాముల విగ్రహాల చెంతకే ఆ నాగేంద్రుడు తరలిరావడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
అమలాపురం రూరల్ మండలం పేరులోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న పూజారి గారి ఇంట్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. నిత్యం ధూపదీప నైవేద్యాలతో వెలిగిపోయే పూజ గదిలోకి సైలెంట్గా ఒక భారీ తాచుపాము ప్రవేశించింది. పూజ గదిలో ఉన్న సీతారాముల విగ్రహాల వద్దకు చేరుకున్న ఆ పాము.. పక్కనే ఉన్న ఒక రాగి చెంబులోకి దూరింది. కాసేపటికి చెంబులో నుండి పడగ విప్పి భీకరంగా బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన ఇంట్లోని వారు ఒక్కసారిగా హడలిపోయారు.

చెంబులో నుంచి పడగ విప్పి చూస్తున్న ఆ నాగరాజును చూసి మొదట జనం భయపడినా, ఆ తర్వాత సీతారాముల వద్దకు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే విచ్చేశాడని భావించి భక్తితో నమస్కరించారు. అయితే, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆ నాగేంద్రుడు అక్కడి నుంచి వెళ్లేందుకు అస్సలు ఇష్టపడలేదు. సీతారాముల చెంతనే ఉంటానన్నట్టుగా పట్టుకునేందుకు వచ్చిన గణేష్ పైనే పడగ విప్పి బుసలు కొట్టింది. సుమారు గంటపాటు ముప్పు తిప్పలు పెట్టిన ఆ తాచుపామును ఎట్టకేలకు గణేష్ వర్మ చాకచక్యంగా డబ్బాలో బంధించి, సురక్షిత ప్రాంతానికి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వేసవి కాలం కావడంతో పాములు చల్లదనం కోసం ఇళ్లలోకి, ముఖ్యంగా ఫ్రిడ్జ్లు, బీరువాల కిందకు వచ్చే అవకాశం ఉంది. పూజ గదిలో జరిగిన ఈ ఘటన భక్తులకు అద్భుతంగా అనిపించినా, సామాన్య ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications