వాటి జోలికి వచ్చే సత్తా జగన్ ఉందా..? ఉంటే సాహసోపేత సీఎంగా చరిత్రలో నిలిచినట్టే..!!
అమరావతి/హైదరాబాద్ : జగన్ అనుకున్నంత పని చేసారు. ఇప్పుడు ఆ పని చేసే ధైర్యముందా...? అనేక మంది మదిలో ఇదే ప్రశ్న. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడం అక్రమమంటూ చంద్రబాబు సహా ఏ ఒక్కరు కూడా గట్టిగా ఖండించలేకపోతున్నారు. ఆ నిర్మాణం చట్ట విరుద్ధం కాబట్టే ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక భవన కూల్చివేతను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా అంగీకరించకూడదన్నారు. ప్రజావేదిక లాగానే కృష్ణా కరకట్ట పైనున్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఆ పని చేస్తే.. జగన్ ను తాను శభాష్ అంటానని కూడా అన్నారు. పవన్ మాత్రమే కాదు, యావత్ ఆంధ్రా ప్రజలు కూడా శభాష్ అంటూ అభినందిస్తారు. దమ్మున్న నేతగా, ధైర్యమున్న సీఎంగా ఆకాశానికెత్తుతారు. ఇంతకీ అన్ని రకాలైన అక్రమ కట్టడాలను కూల్చివేసే దమ్ము, ధైర్యం నిజంగా జగన్ కు ఉన్నాయా...? ఉంటే రంగంలోకి దిగి పని మొదలు పెట్టాలనే వాదలను వినిపిస్తున్నాయి.
Recommended Video
ప్రజా వేదిక సరే..! మిగిలిన కట్టడాలపై జగన్ ప్రణాళిక ఏంటి..!!
కృష్ణా కరకట్టపై చిన్నాచితకా బడుగు జీవులు మొదలు.. బడాబడా బాబుల వరకు ఎందరెందరో గుడిసెలు మొదలు భవంతుల వరకు అక్రమంగా, చట్ట విరుద్ధంగా కట్టుకున్నారు. వీటిలో గెస్ట్ హౌసులు, ఆశ్రమాల వంటివి 27 వరకు ఉన్నాయి. ప్రకృతి వైద్యుడు, యోగా గురువు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఉంది. పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజుకు చెందిన భవంతులు ఉన్నాయి. బాలభవన్ (అనాథ శరణాలయం) ఉంది. పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ సురేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఉంది. పారిశ్రామికవేత్త నెక్కంటి అప్పారావుకు చెందిన భారీ భవంతి ఉంది. దాని పక్కనే, రివర్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది. దీని పక్కనే చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ ఉంది. దాని పక్కనే ఇప్పుడు కూల్చివేసిన ప్రజావేదిక ఉంది. ఈ రెండింటి పక్కనే మరో భవనం (తులసి వనం) ఉంది.
కరకట్టను ఖాళీ చేయించే సత్తా జగన్ ఉందా..! రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతారా..!!
నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదని పర్యావరణ చట్టం చెబుతోంది. ఈ ప్రాంతాల్లోని భూములను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని, పారిశ్రామిక, నివాస, ఇతరత్రా అవసరాలకు వినియోగించకూడదని ఈ చట్టం చెబుతోంది. నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని కూడా చట్టాలు చెబుతున్నాయి. కానీ, వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ అనేకమంది నిర్మాణాలు సాగించారు.
రాజకీయ కక్ష్యగా మారిన ప్రజావేదిక కూల్చివేత..! చిత్తశుద్ది నిరూపించుకోవాలంటే వాటిని కూల్చాల్సిందే..!!
ప్రజావేదిక మొదలుకుని అన్నిరకాలైన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. ఆయన చెప్పినట్టుగా, ప్రజావేదికను కూల్చివేశారు. ఆ తరువాత ఏమిటి...? ఈ కూల్చివేతలు కొనసాగుతాయో...? కాస్తంత విరామం ఇస్తారా...? సమాధానాలు అస్పష్టం. ఈ నేపథ్యంలోనే మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వీటికి కూడా సమాధానాల్లేవు.
జగన్ ఆ పని కూడా చేయాలంటున్న రాజకీయ పక్షాలు.! చేసే ధైర్యం జగన్ కు ఉందా..!!
ఇఫ్పుడు కూల్చివేసిన ప్రజావేదిక పక్కనే ఉన్న (చంద్రబాబు నివాసముంటున్న) లింగమనేని ఎస్టేట్, దానిని ఆనుకుని వరుసగా ఉన్న రివర్ వ్యూ గెస్ట్ హౌస్, తులసి వనం, మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమభవనాలు, గోకరాజు గంగరాజు భవంతులు, బాలభవన్, డాక్టర్ సురేందర్ రెడ్డి గెస్ట్ హౌస్, నెక్కంటి అప్పారావుకు చెందిన భవంతి వీటన్నిటి కూల్చివేత ఎప్పుడు మొదలవుతుంది...? వీటి కూల్చివేతకు తిథులు.. నక్షత్రాలు చూసుకుంటారా..? లేదా, ప్రజావేదిక కొనసాగింపుగా వెంట వెంటనే నేలమట్టం చేస్తారా...? ఈ అక్రమ కట్టడాల కూల్చివేత నిర్ణయం... కేవలం నదీపరివాహక ప్రాంతాలకే పరిమితమా...? ఇతరత్రా, ప్రభుత్వ భూములను ఆక్రమించిన కట్టడాలకు కూడా వర్తిస్తుందా...? ఇలాంటి కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వం గుర్తించిందా...? ఒకవేళ గుర్తిస్తే, వాటన్నిటిని కూడా కూల్చివేస్తుందా...? అనుమతి లేకుండా నడి రోడ్లపై, రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన విగ్రహాలను, వైసీపీ పోటాపోటీగా నిలబెట్టిన వైఎస్సార్ విగ్రహాలను కూడా కూల్చివేస్తుందా...? జగన్ ప్రభుత్వానికి ఆ ధైర్యముందా...? ఉంటే గనక అతంత్య సాహసోపేత సీఎంగా జగన్ చరిత్రపుటల్లోకి ఎక్కడం ఖాయం.