ఓస్.. అంతేనా.. హడావిడి చేసినంత సేపుకూడా లేదుగా భేటీ..! బాబు సమక్షంలో కామెడీ..!!
అమరావతి: సుధీర్గంగా కొనసాగే ఏపి మంత్రి వర్గ సమావేశం ఇలా మొదలై అలా ముగిసింది. ఎట్ట కేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో కేంద్రం అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ భేటీకి ముగ్గురు మంత్రులు మినహా మంత్రులంతా హాజరై పలు సూచనలు చేసినట్టు సమాచారం.
పంతం నెగ్గించుకున్న బాబు.. మంత్రి వర్గ భేటీ అలా పెట్టారు..! ఇలా ముగించారు..!!
మంత్రులు తమ శాఖలకు సంబంధించిన అంశాలను ఈ భేటీలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఈ భేటీలో పాల్గొన్నారు. విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శులు సైతం ఈ భేటీలో పాల్గొని తమ శాఖలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఫొని తుపాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
ఆంక్షల మద్య సమావేశం..! పలు అంశాల పై లేని చర్చ..!!
తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోయాని విపత్తు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ కార్యదర్శులు వివరించారు. ఉపాధి పనులకు సంబంధించి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల కరవు నేపథ్యంలో ప్రజలు వలసలు వెళ్తున్నారని.. ఉపాధి పనుల్లో నిధుల విడుదలలో జాప్యం జరిగిందని, త్వరితగతిన నిధులు విడుదల చేయాలని అధికారులు కోరినట్లు సమాచారం.
ఉపాదీ హామీ అమలులో ఫస్ట్ ప్లేస్..! ఆ అధికారులకు సీఎం అభినందనలు..!!
ఎన్నికల కోడ్ కారణంగా కొత్త పనులేవీ చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో గతంలో జారీచేసినటువంటి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ఆధారంగానే ఈ పనులు చేపట్టాలని సీఎం సూచించినట్టు సమాచారం.ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఐదు విభాగాల్లో తొలిస్థానం, ఆరు విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉపాధిహామీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను అభినందించారు.
నవ్వుల పువ్వులు పూయించిన మంత్రి..! అంతే కామెడీగా సమాధానం చెప్పిన బాబు..!!
సీరియస్గా జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన సరదా వ్యాఖ్యలకు అంతా ఒక్కసారిగా నవ్వేశారు. సమావేశం జరుగుతుండగా మధ్యలో కల్పించుకొని మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి.. తితలీ, ఫొని తుపాన్ల గురించి ఆర్టీజీఎస్ ముందే చెప్పింది. ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పరా? అని సీఎంను ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలతో కేబినెట్ సమావేశంలో మంత్రులంతా ఒక్కసారిగా నవ్వారు. మంత్రి వ్యాఖ్యకు స్పందించిన సీఎం చంద్రబాబు అంతే చమత్కారంగా బదులు ఇచ్చారు. ఓట్ల సునామీ గురించి మీ చెవిలో చెబుతారులే అని అదినారాయణరెడ్డి కి సమాధానం ఇచ్చారు.