ఏపీకి భారీ ప్యాకేజీ: చంద్రబాబు అలర్ట్, మౌనంగా ఉండాలని మంత్రులకు సూచన
అమరావతి: ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన తర్వాతనే మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయాలని, అప్పటి వరకు మౌనంగా ఉండాలని చంద్రబాబు మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది.
మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకూ ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం నుంచి రాష్ట్రానికి ఇస్తామంటూ ప్రతిపాదనల్లో ఉన్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ వరకూ చర్చకు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ గురించి కేంద్రం ఏమంటుందో, అందులో ఏఏ అంశాలు ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలని మంత్రులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతే మంత్రులు తమ అభిప్రాయలను పంచుకోవాలని వెల్లడించారు.

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుతో పాటు మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సభలో ప్రవేశపెట్టబోయే జీఎస్టీ బిల్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన మరో చట్ట సవరణ బిల్లు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలు భూకేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications