నీ పని నీవు చేసుకో!: దేవినేని నెహ్రూ చేరికపై వల్లభనేని వంశీకి బాబు, హామీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడకు చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడె ప్రసాద్లు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరి పని వారు చేసుకోవాలని హితవు పలికారు.
దేవినేని నెహ్రూ టిడిపిలో చేరుతున్న నేపథ్యంలో చేరిక పరిణామాల పైన చర్చించేందుకు వారు చంద్రబాబును గురువారం నాడు కలిశారు. వంశీ, బోడె ప్రసాద్లతో పాటు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు కూడా వారి వెంట ఉన్నారు.
పార్టీలో కొత్తగా చేరే వారితో ఎవరికీ ఇబ్బంది ఉండదని చంద్రబాబు.. వంశీ, బోడె ప్రసాద్లకు హామీ ఇచ్చారని, మీ నియోజకవర్గాల్లో ఎవరి జోక్యం ఉండదని చెప్పారని తెలుస్తోంది. మీ పని మీరు చేసుకోవాలని సూచించారని సమాచారం. ఎవరి నియోజకవర్గాలో వారు పార్టీ పటిష్టత కోసం పని చేయాలన్నారు.
కాగా, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్న విషయం తెలిసిందే. విజయవాడలోని గుణదల బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
నెహ్రూతో పాటు ఆయన కుమారుడు అవినాష్, కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, విజయవాడతో పాటు, జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు టిడిపిలో చేరనున్నారు.