మళ్లీ టార్గెట్ కిరణ్!: సీన్ లేదని కొత్త పార్టీ అశలపై డొక్కా
కొందరు కాంగ్రెసు పార్టీలో ఉంటూ విమర్శలు చేస్తున్నారని, అది సరికాదన్నారు. పార్టీ విధానాలు నచ్చకుంటే బయటకు వెళ్లిపోవచ్చునని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీలు మనుగడ సాధించలేవన్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదన్నారు.
కాబట్టి కొత్త పార్టీ పెట్టాలనుకునే వారు ఆశలు ఏమాత్రం నెరవేరవన్నారు. విభజన విషయమై అన్ని పార్టీలు మంత్రుల బృందానికి(జివోఎం) నివేదిక ఇవ్వాలన్నారు. కాగా, డొక్కా కొత్త పార్టీ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వర్గాన్ని ఉద్దేశించి అన్నట్లుగా కనిపిస్తోంది. గతంలోను ఆయన పరోక్షంగా కిరణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరు ఒకే మాట మీద ఉండాలి: షబ్బీర్ అలీ
విభజన పైన కాంగ్రెసు పార్టీ, కేంద్రం నుండి ప్రకటనలు వచ్చాక మళ్లీ మొదటికి తీసుకు రావొద్దని, ఎవరు సమైక్యాంధ్ర అనవద్దని శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ వేరుగా చెప్పారు. అధిష్టానానికి కట్టుబడి ఉండి అందరూ ఒకే మాట మీద ఉండాలని సూచించారు. విభజన పైన కాకుండా సమస్యల పైన చర్చించాలని, అందుకు తాము కూడా సహకరిస్తామని చెప్పారు.
రాజ్యాంగ ప్రక్రియలో జోక్యం చేసుకోం: జానా
తాము రాజ్యాంగ ప్రక్రియలో జోక్యం చేసుకొమని, ప్రజల అభిప్రాయాలను చెబుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి వేరుగా చెప్పారు. కాగా తెలంగాణ ప్రాంత నేతలు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అయిన అనంతరం ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో సమావేశమయ్యారు.