భూసేకరణపై డొక్కా హెచ్చరిక: మంత్రుల వివరణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి భూ సమీకరణపై ప్రభుత్వం హడావుడిగా తొందరపాటుతో వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎన్నో అనర్ధాలు, మరెన్నో అసమానతలు తలెత్తుతాయని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానికి భూ సమీకరణ ప్రాంతాల్లో రైతులతోపాటు రైతు కూలీలు, వివిధ రకాల వృత్తి పనివారాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాల భ విష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలన్నారు. తుళ్లూరు మండల పరిధిలో భూమిపై ఆధారపడిన రైతు కూలీలకు భవిష్యత్తులో రూ రెండు వేలు పెన్షన్ అందించాలన్నారు. వారందరికి రాజధాని పరిధిలోనే స్థిర నివాసం కల్పించాలన్నారు.
అన్ని పార్టీల నాయకులు రైతుల పక్షాన నిలబడాల్సిందేనని రాజధాని భూసమీకరణ సబ్కమిటీ సభ్యుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పష్టంచేశారు.
తుళ్లూరు ప్రధాన కూడలి వద్ద ఆదివారం వివిధ పార్టీల నాయకులు, రైతులతో మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

సమావేశంలో పలుగ్రామాల రైతుల నుండి అభిప్రాయాలను సేకరించారు. రాజధాని హద్దులను
వివరించిన మంత్రి ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి చేరుస్తామన్నారు. ల్యాండ్పూలింగ్కు ముందుకువచ్చే రైతులవద్ద మాత్రమే భూ సమీకరణ చేస్తామని, బలవంతంగా
భూములు లాక్కునే ప్రయత్నం చేయబోమని హామీ ఇచ్చారు. వడ్లమాను గ్రామ రైతులు రాజధానిలో తమ గ్రామాన్ని కూడా చేర్చాలని పుల్లారావును కోరారు. భూ సమీకరణలోని ప్రతి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు చొప్పున నేరుగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి వారి అనుమానాలు నివృత్తి చేస్తామని, ఏవైనా సమస్యలుంటేవారు సిఎంతో చెప్పవచ్చని తెలిపారు.
రాజధాని పరిధిలోని భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, అత్యంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే తప్ప రైతులు భూములు అమ్ముకోవద్దని సూచించారు. భూ సమీకరణ వల్ల ప్రతి రైతుకూ గరిష్టంగా మేలు చేకూరుతుందన్నారు. మండల ప్రజలు కోరిన విధంగా తహశీల్దార్ను వెంటనే మార్చామని, సబ్కమిటీలోకి ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ను చేర్చామని, రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు నాయుడు
చాలా స్పష్టతతో ఉన్నారని తెలిపారు.
భూ సమీకరణలోని ప్రతిగ్రామాన్ని సందర్శించి బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాజధాని పరిధిలోని గ్రామాలను త్వరితగతిన అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులకు యూరియా కొరత లేదని బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయవద్దని సూచించారు. పత్తికి 4,050 రూపాయల మద్ధతుధరను ప్రకటిస్తామన్నారు. గుంటూరు, విజయవాడ నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజా రాజధానే లక్ష్యంగా తెలుగుదేశం పనిచేస్తుందని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications