మోడీని నితీష్తో పోల్చొద్దు: కన్నా, బీహార్లో బిజెపి ఓటమిపై టిడిపి ఖుషీ?
గుంటూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పోల్చడం ఏమాత్రం సరికాదని ఏపీ భారతీయ జనతా పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం అన్నారు. అనైతిక పొత్తుల వల్లే బీహార్లో మహాకూటమి విజయం సాధించిందని చెప్పారు.
2010 ఎన్నికల కన్నా బిజెపికి పది శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. ప్రధాని మోడీని నితీష్తో పోల్చడం సరికాదన్నారు. ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పునరుద్ఘాటించారు. బిజెపి నేతల పైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
బీహార్లో బిజెపి ఓటమిపై టిడిపి ఖుషీగా ఉందా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందిన నేపథ్యంలో ఏపీలో ఆ పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీలో ఖుషీగా ఉందా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయఢంకా నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకు ఇక చిక్కులే అన్న వాదనలు వినిపించాయి.
తాజాగా, బీహార్ ఎన్నికల్లో బిజెపి ఓటమితో విపక్షాలతో పాటు ఎన్డీయేలోని ప్రాంతీయ పార్టీలు కూడా ఖుషీగా ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో టిడిపిలోని చాలామంది సంతోషిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో బిజెపి నుంచి సరైన హామీ లభించడం లేదని, అలాగే 2014 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో ఏపీ పైన కమలదళం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.
తద్వారా 2019 ఎన్నికల నాటికి ఏపీలో టిడిపికి ధీటుగా ఎదగాలని బిజెపి భావిస్తోందని, ఇది తమకు చిక్కేనని, ఇప్పుడు బీహార్ ఓటమి నేపథ్యంలో అది ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చిందని కొందరు టిడిపి నేతలు చెవులు కొరుక్కుంటున్నారని చెబుతున్నారు.